కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో లాక్డౌన్ను పూర్తిస్థాయిలో అమలు చేస్తుంది. అయినప్పటికీ కొంతమంది లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా, ఏవేవో కారణాలు చెబుతూ రోడ్ల మీదకు వస్తున్నారు. దీంతో హైదరాబాద్ పోలీసులు ఈ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై నగరంలో ఎవరైనా రోడ్ల మీదకు వస్తే వాహనాలను స్వాధీనం చేసుకోనున్నారు. వైద్య సంబంధ, అత్యవసర కారణాల మినహా చిన్న చిన్న కారణాలతో రోడ్లపైకి వచ్చే వారి వాహనాలను స్వాధీనం చేసుకుని, లాక్డౌన్ ముగిసాక అప్పగించాలని హైదరాబాద్ పోలీసులు నిర్ణయించారు.
ఏప్రిల్ 7, మంగళవారం వరకు రోడ్లపై వచ్చే వారికీ హెచ్చరికలతో సరిపెట్టిన పోలీసులు తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. లాక్డౌన్ సందర్భంగా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ అమీర్పేట, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, పాతబస్తీ, మరియు నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లో వందల సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. ఈ తీరును తీవ్రంగా పరిగణిస్తూ పోలీస్ ఉన్నతాధికారులు కమాండ్ కంట్రోల్ రూం ద్వారా ట్రాఫిక్ పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. దీంతో లాక్డౌన్ సమయంలో ఎలాంటి కారణం లేకుండా రోడ్లపైకి వచ్చే బైక్లు, కార్లు, ఇతర నిషేదిత వాహన దారులపై ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం కేసులు నమోదు చేసి, ఆ వాహనాలను స్వాధీనం చేసుకోనున్నట్టు పోలీసులు ప్రకటించారు.
#Stayhome #Lockdown #covid19 pic.twitter.com/K2ShocfsZq
— Hyderabad City Police #StayHome 🏠 #StaySafe (@hydcitypolice) April 8, 2020