రైజింగ్ తెలంగాణ 2050: సీఎం రేవంత్ రెడ్డిని అభినందించిన WEF

Rising Telangana 2050 WEF Applauds CM Revanth Reddys Visionary Leadership

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సదస్సులో పాల్గొని రాష్ట్ర అభివృద్ధి దిశగా కీలక చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ. 1,80,000 కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించడంతో పాటు, తెలంగాణ భవిష్యత్ ప్రణాళికలను గ్లోబల్ వేదికపై విశ్లేషణాత్మకంగా వివరించారు. దీనికి స్పందనగా WEF అధ్యక్షుడు బోర్జ్ బ్రెండె, మేనేజింగ్ డైరెక్టర్ మిరెక్ డూసెక్ సంయుక్తంగా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.

WEF ప్రశంసలు – సమర్థ నాయకత్వానికి గ్లోబల్ గుర్తింపు
ఈ లేఖలో WEF, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి రూపొందించిన విధానాలను దార్శనికమైనవి గా అభివర్ణించింది. ముఖ్యంగా, “రైజింగ్ తెలంగాణ 2050” అనే నినాదం ద్వారా తెలంగాణ భవిష్యత్ దిశను స్పష్టంగా నిర్ధేశించారని ప్రశంసించింది. 2047 కల్లా హైదరాబాదును కాలుష్యరహిత నగరంగా మార్చేందుకు ప్రకటించిన “నెట్-జీరో” లక్ష్యం గొప్ప సంకల్పమని పేర్కొంది.

తెలంగాణ – పెట్టుబడిదారులకు హాట్ డెస్టినేషన్
WEF నివేదికలో తెలంగాణను ఆకర్షణీయ పెట్టుబడి రాష్ట్రంగా అభివర్ణించారు. సీఎం రేవంత్ రెడ్డి గ్లోబల్ కంపెనీలను ఆకర్షించేందుకు చేపట్టిన ఆర్థిక వ్యూహాలు రాష్ట్ర ప్రగతికి దోహదం చేస్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా, పర్యావరణ పరిరక్షణ, పట్టణాభివృద్ధి, నగర రవాణా సౌకర్యాలు వంటి విభాగాల్లో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తాయని స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న సీఎం దార్శనికతను WEF ప్రత్యేకంగా ప్రశంసించింది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి భవిష్యత్తు ప్రణాళికల అమలుకు మద్దతుగా తమ వంతు సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామని WEF తన లేఖలో స్పష్టం చేసింది. CM రేవంత్ రెడ్డికి వచ్చిన WEF లేఖ, తెలంగాణ అభివృద్ధి దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న పలుసారమైన నిర్ణయాలకు అంతర్జాతీయ గుర్తింపుగా మిగిలింది. దీనిపై కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తూ, లేఖను సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.