తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం అయ్యాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమ అస్త్రాలుగా అధికారపార్టీ కాంగ్రెస్ అడుగుపెడుతుండగా.. ప్రజాసమస్యలపై గొంత్తెత్తాలని ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. ఇక బీజేపీ సూపర్ సిక్స్పై గళమెత్తడానికి తమ ప్రశ్నలను రెడీ చేసుకుంటోంది. మొత్తంగా మార్చి 27 వరకూ సాగనున్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా కొనసాగనున్నాయి.
తొలి రోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం చేశాక సభ వాయిదా పడనుంది. దీని తర్వాత స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. అలాగే ఈనెల 15 నుంచి 18వరకు అసెంబ్లీలో కులగణనపై చర్చ, బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులపై చర్చలు జరనున్నాయి. కాగా.. ఈ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా హాజరవుతుండటంతో అందరి చూపు అసెంబ్లీ సమావేశాలపైనే పడింది. దీనిపై ఇప్పటికే గులాబీబా స్ బీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించారు.
సభలో కృష్ణా జలాల హక్కు,రుణమాఫీ, రైతుభరోసా, రైతుల ఆత్మహత్యలు, స్థానిక సంస్థల నిధుల కొరత వంటి అంశాలు ప్రధాన ఎజెండాగా సాగనున్నాయి. దేశంలో తొలిసారి కులగణన సర్వేతో పాటు ఎస్సీ వర్గీకరణ చేపట్టిన ఘనత తమ కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని రేవంత్ సర్కార్ గట్టిగా వాదించనుంది. ఇదే సభలో బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం తెలిపాక.. కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పార్లమెంట్లో ఆమోదం పొందడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. సభను మధ్యలో వాయిదా వేసి ప్రధాని మోదీని కలవడానికి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లే అంశంపైన కూడా రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
మార్చి 12న ప్రారంభమయిన అసెంబ్లీలో , శాసనసభ, మండలి సమావేశాలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగం తర్వాత.. BAC సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాలను ఎంతకాలం నిర్వహించాలనేది ఈ B.A.C భేటీలోనే నిర్ణయం తీసుకోనున్నారు. మార్చి 13న గురువారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది.అలాగే మార్చి 14 హోలీ సందర్భంగా అసెంబ్లీకి సెలవు ఉండనుంది. మార్చి 15 నుంచి మార్చి 18వరకూ కులగణన సర్వే, బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ సాగనుంది. మార్చి 18 లేదా 19 2025-26 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అలాగే మార్చి 27 లేదా 28 అసెంబ్లీ సమావేశాలు ముగిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.