దుబ్బాక అసెంబ్లీ నియోజక వర్గ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఎం.రఘునందన్ రావు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ ఓటమిపై టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డనాటి నుంచి రాష్ట్రంలో ఇప్పటిదాకా ఏ ఎన్నికలు వచ్చిన కూడా టిఆర్ఎస్ పార్టీ అప్రతిహతంగా, అనితరసాధ్యంగా విజయాలను నమోదు చేసిందని అన్నారు. సంవత్సరం కిందట హుజుర్ నగర్ ఉపఎన్నికలో కూడా బ్రహ్మాండమైన విజయాన్ని నమోదు చేశామన్నారు. ఏ ఎన్నికల్లో గెలిచినప్పుడైనా గతంలో ఒకటే చెప్పామని అన్నారు. విజయాలకు పొంగిపోము, గర్వపడము. అపజయాలకు కుంగిపోము, ఎదురుదెబ్బలకు ఇబ్బందిపడము అని మంత్రి కేటిఆర్ అన్నారు. దుబ్బాక ఉపఎన్నికలో టిఆర్ఎస్ పార్టీకి ఓటువేసిన 62 వేలకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పార్టీని గెలిపించేందుకు అహర్నిశలు శ్రమించిన మంత్రి హరీష్ రావుకు, ఎమ్మెల్యేలకు, నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
ఆశించిన ఫలితం రాలేదు:
ఈ ఉపఎన్నికలో ఫలితం ఆశించినట్టుగా రాలేదని, రాజకీయాల్లో పోటీ చేసినప్పుడు సహజంగా గెలుపొంది ప్రజలమెప్పు పొందాలనే పనిచేస్తామని కేటిఆర్ అన్నారు. ఈ ఓటమి పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఒకరకంగా అప్రమత్తం కావడానికి కూడా పనికొస్తుందని చెప్పారు. అదేవిధంగా ఆశించిన ఫలితాలు రాకపోవడంపై గల కారణాలను విశ్లేషించుకుంటాం, ఈ తీర్పును లోతుగా సమీక్షించుకుని ముందుకెళ్తామని మంత్రి కేటిఆర్ స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ