తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆశయాల కనుగుణంగా పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనము పెంపొందించడానికి ఈ-ఆఫీస్ సిస్టం ప్రవేశపెట్టబడిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. 6 శాఖలలో ఈ-ఆఫీస్ సిస్టం ప్రారంభం సందర్భంగా, అతి కొద్ది కాలంలోనే అధికారులు కష్టపడి ఈ-ఆఫీస్ సిస్టం అందుబాటులోనికి తీసుకొని వచ్చినందుకు అధికారులను సీఎస్ సోమేశ్ కుమార్ అభినందించారు. జూలై 18, శనివారం నుండి ఈ కొత్త విధానం ద్వారా 1600 మంది పైగా ఉద్యోగులు పనిచేస్తారని అన్నారు. సాధారణ పరిపాలనా శాఖ, అబ్కారీ, మద్య నిషేధ శాఖ, వాణిజ్య పన్నులు, ప్రధాన కమీషనర్, భూ పరిపాలన,పంచాయతి రాజ్& గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమం శాఖలు ఈ విధానంలో ముందంజలో ఉన్నందుకు అభినందించారు. ఇతర శాఖలు కూడా ఈ-ఆఫీస్ సిస్టం క్రింద పనిచేసేలా చూడాలని ఆదేశించారు.
ఈ విధానం ద్వారా పారదర్శకత ఉంటుందని సీఎస్ సోమేశ్ కుమార్ చెప్పారు. దీని వలన అనవసర కాగితాల పని మరియు చాలా సమయం ఆదా అవుతుందని అన్నారు. ప్రతి ఫిర్యాదు, దరఖాస్తుకు జవాబుదారీతనమునకు ఈ విధానము చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ-ఆఫీస్ సిస్టం ద్వారా ఎలక్ట్రానిక్ పద్ధతి ద్వారా ఫైళ్ళు పరిష్కరించబడతాయని, ఈ విధానం కాగితరహితంగా ఉంటుందని అన్నారు. కరోనా నేపథ్యంలో ఈ విధానం ద్వారా కాగితాలతో పనిలేకుండా సురక్షితంగా పనిచేయడానికి వీలు అవుతున్నందున అధికారులు, ఉద్యోగులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu