మద్యం అమ్మకాలలో దుమ్ము రేపిన తెలంగాణ.. పది రోజుల్లో వెయ్యి కోట్లకు పైగా మద్యం అమ్మకాలు

Telangana Sees a Massive Surge in Liquor Sales | Mango News Telugu

దసరా పండుగ సమయంలో తెలంగాణలో మద్యం ఏరులై పారింది. దీంతో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు మరోసారి రికార్డు స్థాయిలో జరిగాయి. ఈ పండుగ పది రోజుల్లో తెలంగాణలో దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా.. మద్యం విక్రయాలు జరిగాయని తేలడంతో మందుబాబులు కూడా షాక్ అవుతున్నారు.

బార్లు, మద్యం దుకాణాలు, పబ్ లలో భారీగా అమ్మకాలు పెరగడంతో యజమానులు ఖుషీ అవుతున్నారు. మరోవైపు తెలంగాణా ఖజానాకు కూడా మద్యం భారీ ఆదాయాన్నే తెచ్చి పెట్టింది. ముఖ్యంగా హైదరాబాద్లోనే భారీగా అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తేల్చారు. చాలామంది దసరా శెలవుల్లో స్వగ్రామాలకు తరలివెళ్లినా కూడా ఈ రేంజ్‌లో మద్యం అమ్మకాలు జరగడంతో అధికారులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణలో 2,260 మద్యం షాపులు, 1,171 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వీటితో పాటు పబ్‌లలోనూ మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. ప్రతీ ఏటా దసరా సమయంలో తెలంగాణలో మద్యం అమ్మకాలు భారీగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఈ సారి కూడా అదే అంచనాతో ముందుగానే ఎక్సైజ్ శాఖ భారీగానే మద్యం నిల్వలను సిద్దం చేసింది.

అయితే అధికారులు కూడా షాక్ అయ్యే విధంగా ఈసారి ఆర్డర్లు వచ్చాయి. బార్లు, పబ్‌లు కూడా భారీగా స్టాక్ ను మెయిన్ టెయిన్ చేసాయి. కొంతమంది దసరా కంటే ముందుగానే కొనుగోళ్లు జరిపి స్టాక్ పెట్టుకున్నారు. దీనివల్ల దసరా ప్రారంభానికి ముందు నుంచే అమ్మకాల కిక్కు షురూ అయింది సెప్టెంబర్ 30వరకు 2,838.92కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి.

అక్టోబర్ నెల ప్రారంభం నుంచి కనుక చూస్తే అక్టోబర్ 11 వరకు 1,057.42 కోట్ల రూపాయల విక్రయాలు జరిగినట్లు లెక్కలు తేల్చాయి. అమ్మకాల్లో రంగారెడ్డి జిల్లా టాప్ లో ఉండగా, కరీంనగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాలు రంగారెడ్డి తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అంతేకాదు పండగ చివరి మూడు రోజులు అంతకు మించి అన్నట్లుగా అమ్మకాలు జరిగినట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

ఎక్సైజ్ డిపోల నుంచి 205.42 కోట్ల రూపాయల విలువైన మద్యం రిటైల్ దుకాణాలకు చేరగా.. అందులో లిక్కర్, బీర్ల అమ్మకాలు పోటీ పడ్డాయి.మరోవైపు పండుగ చివరి రోజైన శనివారం, ఆదివారం రోజు అయితే రెట్టింపు స్థాయిలో అమ్మకాలు జరిగినట్లు అధికారిక లెక్కలు తేల్చాయి. మొత్తంగా దసరా పండుగ సమయంలో తెలంగాణలో వెయ్యి కోట్లకు పైగా విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు అబ్కారీ అధికారులు చెబుతున్నారు.