గద్దర్‌ అవార్డ్స్‌ వేడుకను సక్సెస్ చేయాలి – ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు

TFDC Chairman Dil Raju Calls For Huge Success of TGF Awards Event

కొంత విరామం తరువాత సినిమా నటీనటులను, సాంకేతిక నిపుణుల ప్రతిభను ప్రోత్సాహించే సంప్రదాయ కార్యక్రమానికి సీఎం రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం మళ్లీ శ్రీకారం చుట్టింది. తెలంగాణ గద్ధర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ను ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. 2024లో విడుదలైన ఉత్తమ చిత్రాలకు వాటిలో నటించి ఉత్తమ ప్రతిభను చూపిన నటీనటులకు, సాంకేతిక నిపుణులతో పాటు 2014 జూన్‌ నుండి 2024 డిసెంబర్‌ 31 వరకు సెన్సారు జరుపుకున్న చిత్రాల్లో కూడా ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి ఇందులో భాగంగా అవార్డ్స్‌ ఇవ్వనున్నారు.

కాగా అపూర్వ వేడుక కోసం హైదరాబాద్‌లోని హైటెక్స్‌ వేదిక సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. జూన్‌ 14న అంగరంగ వైభవంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ వేడుకకు సీఎం రేవంత్‌ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు, సినిమాటోగ్రఫీ మినిస్టర్‌ కోమటి రెడ్డి వెంకటరె్డి గారు, టీఎఫ్‌డీసీ ఛైర్మన్‌, ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు దిల్‌ రాజు గారు అత్యంత ఘనంగా జరిపించడానికి భారీ ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక వేడుకకు తెలుగు తారాలోకమంతా తరలి రాబోతున్నారు. మొత్తంగా దాదాపు 6వేల మంది హాజరవనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ అవార్డుల కార్యక్రమం గురించి వివరించేందుకు ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు నిన్న పాత్రికేయుల సమావేశం ఏర్పాటుచేశారు. ఇక ఈ సందర్భంగా దిల్‌ రాజు మాట్లాడుతూ.. “ఈ నెల 14న హైటెక్స్‌ వేదికగా తెలంగాణ గద్దరు అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. 14 సంవత్సరాల తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ఈ కార్యక్రమం విజయవంతం చేయాలసిన బాధ్యత సినీ పరిశ్రమపై కూడా ఉంది. ఆ రోజు కార్యక్రమానికి ఐ అండ్‌ పీఆర్‌ ద్వారా లైవ్‌ ప్రసారం కానుంది.” అని తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ప్రపంచవ్యాప్తంగా ఈవెంట్‌ అందరికి రీచ్‌ అవ్వాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది. సాయంత్రం ఆరు గంటలకు ఈ వేడుక ప్రారంభం కానుంది. 2014 నుంచి 2023 వరకు విడుదలైన సినిమాల్లో ప్రతి ఏడాది నుంచి మూడు ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి వాటికి ఈ వేడుకలో అవార్డులు అందిస్తున్నాం. ప్రతి సంవత్సరానికి సంబంధించి ఎంపికైన మూడు ఉత్తమ చిత్రాలకు పనిచేసిన హీరో, హీరోయిన్‌, దర్శకుడు, నిర్మాతలకు అందిస్తున్నాం.” అని చెప్పారు.

అలాగే ఈ అవార్డుల వేడుకకు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వారు విచ్చేసి జయప్రదం చేయాలని పిలుపునిస్తూ.. “ఇలాంటి ఓ మంచి సాంప్రదాయాన్ని గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డులతో ఇంట్రడ్యూస్‌ చేస్తున్నాం. 2024లో విడుదలైన ఉత్తమ చిత్రాలకు, ఉత్తమ సాంకేతిక నిపుణులకు కూడా అవార్డులు అందజేస్తున్న సంగతి తెలిసిందే. 14 సంవత్సరాల తరువాత జరుగుతున్న ఈ వేడుకను తెలుగు సినీ పరిశ్రమలోని అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.