ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని హాథ్రాస్ కు చెందిన 20 ఏళ్ల యువతిపై సెప్టెంబర్ 19న నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తల్లితో కలిసి పొలానికి వెళ్లిన యువతిని లాక్కెళ్లి పోయి దుర్మార్గంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నిందితులు రాక్షసంగా వ్యవహరించడంతో యువతి తీవ్రంగా గాయపడ్డారు. ముందుగా ఆమెను అలీఘర్లో ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు, అనంతరం మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి మృత్యువుతో పోరాడుతున్న ఆ యువతి, పరిస్థితి విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో కన్నుమూసింది.
అయితే ఆసుపత్రి నుంచి నేరుగా యువతి మృతదేశాన్ని హాథ్రాస్కు తరలించి, అర్ధరాత్రి 2 గంటల సమయంలో పోలీసులు, మెజిస్టేట్ సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించడంపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి. యువతి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులను, బంధువులను అనుమతించలేదనే ఆరోపణలు వెల్లువెత్తగా, పోలీసులు జిల్లా మెజిస్టేట్ ఈ ఆరోపణలను ఖండించారు. న్యాయం జరగాల్సిన యువతి పట్ల అమానుషంగా వ్యవహరించారంటూ యూపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు పెద్దఎత్తున విమర్శలు చేస్తున్నాయి.
మరోవైపు ప్రాణాలు కోల్పోయిన యువతికి న్యాయం జరగాలంటూ సోషల్ మీడియాలో పలువురు ప్రముఖులు, నాయకులు, నెటిజన్స్ స్పందిస్తున్నారు. ఇలాంటి దారుణానికి ఒడిగట్టిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు హాథ్రాస్ లో యువతిపై జరిగిన ఘటన దురదృష్టకరమని, ఈ ఘటనకు పాల్పడినవారు తప్పించుకోలేరని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని, ఈ బృందం రాబోయే ఏడు రోజుల్లో తన నివేదికను సమర్పించనుందని చెప్పారు. త్వరితగతిన న్యాయం జరిగేలా, ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించనున్నట్టు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనపై తనతో మాట్లాడారని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారని సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu