హుజూర్నగర్ నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికలకు సెప్టెంబర్ 30, సోమవారంతో నామినేషన్ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు పలువురు నామినేషన్స్ దాఖలు చేస్తుండడంతో అక్కడ సందడి నెలకుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి రెడ్డి సోమవారం నాడు నామినేషన్ వేశారు. తమకు స్లాట్ ఉన్నా కూడ వేరే అభ్యర్థుల నామినేషన్లు తీసుకుని ఇబ్బందులు పెట్టారని ఆమె విమర్శించారు. మహిళా అభ్యర్థిని మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి అవమానిస్తున్నారని పద్మావతి తెలిపారు. మరో వైపు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి కూడ ఈ రోజు నామినేషన్ దాఖలు చేసారు. ఆయన వెంట నామినేషన్ వేసే సమయంలో మంత్రి జగదీష్ రెడ్డి, మల్లయ్య యాదవ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు.
ఇక బీజేపీ పార్టీ అభ్యర్థిగా రామారావు నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు బీసీలకు టికెట్ ఇవ్వలేదని విమర్శించారు. తనను గెలిపిస్తే హుజూర్నగర్ లో మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తానని అన్నారు. టీడీపీ నుంచి చావా కిరణ్మయి, సీపీఎం నుంచి పారేపల్లి శేఖర్రావు నామినేషన్ వేశారు. సర్పంచుల సంఘం తరపున నామినేషన్స్ వేయడానికి పలువురు అక్కడికి తరలి వస్తున్నారు. నామినేషన్స్ పెద్ద సంఖ్యలో వేస్తూ ఉండడంతో అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేసారు. తన భూమిని కబ్జా చేసినందుకు నిరసనగా ఈ ఉపఎన్నికల్లో 85 ఏళ్ల వృద్ధురాలు నామినేషన్ పత్రాలు దాఖలు చేసారు. ఇక్కడ నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న కూడ ఈ రోజు నామినేషన్ పత్రాలు దాఖలు చేసారు.
[subscribe]