హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జనాల శోభాయాత్ర కొనసాగుతుంది. శుక్రవారం మధ్యాహ్నం మొదలయిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన శోభాయాత్ర భక్తుల కోలాహలం మధ్య ఘనంగా జరిగింది. ఈ ఏడాది ఖైరతాబాద్లో 50 అడుగుల ఎత్తు మేర మట్టితో చేసిన శ్రీ పంచముఖ మహా లక్ష్మీ గణపతి రూపంలో గణేశుడు భక్తులకు దర్శనం ఇచ్చి, పూజలు అందుకున్న విషయం తెలిసిందే. మహాగణపతి విగ్రహానికి కుడివైపున శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి, ఎడమవైపున శ్రీ త్రిశక్తి మహాగాయత్రీ దేవి అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. శోభాయాత్రలో భాగంగా మహాగణపతి దర్శనం కోసం లక్షలాది భక్తులు ట్యాంక్ బండ్ కు తరలివచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం ఖైరతాబాద్ నుంచి శోభాయాత్ర ప్రారంభించగా 5 గంటల అనంతరం ఎన్టీఆర్ మార్గ్ కు చేరుకున్న మహాగణపతికి అశేష భక్తజన కోలాహలం మధ్యలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ మార్గ్ లోని క్రేన్ నంబర్ 4 వద్ద ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు. 10 రోజుల పాటు పూజలందుకున్న మహాగణపతికి ప్రభుత్వం ఘనంగా చేసిన ఏర్పాట్లతో ఉత్సవ సమితి సభ్యులు నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా పూర్తి చేసారు.
ముందుగా శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకుని చివరి పూజలు చేశారు. అనంతరం మహా గణపతిని భారీ క్రేన్ సహాయంతో ట్రాలీ పైకి ఎక్కించి నిమజ్జన శోభాయాత్ర ప్రారంభించారు. శోభాయాత్ర తెలుగుతల్లి ఫ్లై ఓవర్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ట్యాంక్ బండ్ మీదకు చేరుకుంది. గంటలపాటు సాగిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన శోభాయాత్రకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. మహాగణపతిని సాగనంపడానికి భక్తజనం తండోపతండాలుగా తరలిరావడంతో హుస్సేన్ సాగర్ పరిసరప్రాంతాలు జనసంద్రంగా మారాయి. భక్తులు గణేశుడిని కీర్తించే నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. ఇక ఎలాంటి ఆటంకాలు లేకుండా మహాగణపతి నిమజ్జనం ప్రశాంతంగా పూర్తవడంతో పోలీస్ సిబ్బంది, జీహెఛ్ఎంసీ సిబ్బంది, సంబంధిత అధికారులు, ఉత్సవ సమితి సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY