ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సెప్టెంబర్ 30, సోమవారం నాడు గ్రామ, వార్డు సచివాలయ రాత పరీక్షల్లో అర్హత సాధించి ఉద్యోగాలకు ఎంపికయిన పలువురికి నియామక పత్రాలు అందజేసారు. విజయవాడ ఏప్లస్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ హాజరయ్యి ఉద్యోగం సాధించిన వారందరికీ అభినందనలు తెలియజేసారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ, ప్రజలకు సేవలందించడానికే ఈ ఉద్యోగాలు చేస్తున్నామని గుర్తించుకోవాలని కోరారు. అవినీతికి తావు లేకుండా, పారదర్శకంగా అర్హులైన ప్రజలందరికి ప్రభుత్వ పధకాలు చేరువ చేసే బాధ్యత ఉద్యోగులదే అని పేర్కొన్నారు.
ఈ నోటిఫికేషన్ లో ఉద్యోగాలు రాని అభ్యర్థులు నిరాశ చెందవద్దని, రాష్ట్రంలో నిరుద్యోగాన్ని రూపుమాపడానికి ఇక నుండి ప్రతి సంవత్సరం ఉద్యోగాల నియామక పక్రియ చేపడతామని వైఎస్ జగన్ అన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను గుర్తించి ప్రతి ఏటా జనవరి నెలలో భర్తీ చేస్తామని తెలిపారు. లక్షా 40వేల మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించడం ఒక రికార్డ్ అని చెప్పారు. నాలుగునెలల కాలంలోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, ఇందుకు పనిచేసిన అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందనలు తెలియజేసారు. త్వరలో గ్రామ వాలంటీర్లకు స్మార్ట్ ఫోన్ అందిస్తామని అన్నారు. డిసెంబర్ మొదటి వారం కల్లా స్మార్ట్ ఫోన్లతో పాటు, సచివాలయానికి అవసరమైన అన్ని పరికరాలు చేకూర్చుతామని ప్రకటించారు. 2020 జనవరి 1 నుంచి అన్ని గ్రామాలలో దాదాపు 500 రకాల సేవలు పూర్తిగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
[subscribe]