నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన బోగీని ఆనందయ్య మందును పంపిణీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆనందయ్య ఇస్తున్న కళ్ళలో వేసే డ్రాప్స్, కే రకం మందు తప్ప, మిగతా పీ, ఎల్, ఎఫ్ మందుల పంపిణీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆనందయ్య మందు పంపిణీ విధానంపై నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్దన్రెడ్డి, ఆనందయ్య, ఇతర అధికారులు సమావేశమై చర్చించారు.
ఆన్లైన్ విధానం ద్వారా ఆనందయ్య మందు పంపిణీ :
సమావేశం అనంతరం నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు మాట్లాడుతూ, హైకోర్టు ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆనందయ్య మందు పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ముఖ్యంగా ఆనందయ్య మందు కోసం ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు కృష్ణపట్నంకు తరలిరాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామన్నారు. ఆనందయ్య తయారుచేస్తున్న మందు వికేంద్రీకరణ పద్దతిలో మరియు ఆన్లైన్ విధానం ద్వారా పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఒక కాల్ సెంటర్ మరియు మొబైల్ యాప్ ఏర్పాటు చేసి అవసరమైన వారి అభ్యర్ధనలు మేరకు వారికీ పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామాలకు చెందిన ప్రజలు మందు కోసం కృష్ణపట్నం రావొద్దని, రాష్ట్రంలో అన్ని చోట్ల లాగానే కృష్ణపట్నంలో కూడా కర్ఫ్యూ, కోవిడ్ నిబంధనలు అమల్లో ఉంటాయని చెప్పారు. నాలుగైదు రోజుల్లో మందు తయారీకి అవసరమైన ముడి సరుకులు సమీకరించి, తయారైన అనంతరం వికేంద్రీకరణ ద్వారా మరియు ఆన్లైన్ ద్వారా మందు పంపిణీ ప్రారంభిస్తామని కలెక్టర్ చక్రధర్ బాబు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ