కరోనా విపత్తు వేళ పేదలను ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో పేదలకు 20కిలోల ఉచిత బియ్యం అందించడానికి పౌరసరఫరాల శాఖ నిర్ణయం తీసుకుందన్నారు. ఉచిత బియ్యం పేదలకు సత్వరం అందేలా చూడడంతో పాటు రేషన్ డీలర్ల సమస్యలపై మంగళవారం నాడు ఉన్నతాధికారులు, రేషన్ డీలర్ల అసోసియేషన్ తో మంత్రి గంగుల కమలాకర్ ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారు.
త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్ల ఖాళీల భర్తీ :
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పెండింగ్ లో ఉన్న 56.7 కోట్ల బకాయిలను ప్రభుత్వం దృష్టికి తేగానే రేషన్ డీలర్లకు విడుదల చేశామని చెప్పారు. గత సంవత్సరంన్నర కాలంగా నెలకొన్న గడ్డుపరిస్థితుల్లో అర్ధాకలితో ఎవరూ అలమటించకూడదని పౌరసరఫరాల శాఖ ఆద్వర్యంలోని రేషన్ డీలర్లు నిర్విరామంగా కృషి చేస్తున్నారని వారిపై ఉన్న పని ఒత్తిడిని తగ్గించడం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ల నియామకాల్ని పూర్తి పారదర్శకంగా ప్రభుత్వ నిబందనల మేరకు చేపట్టాలని మంత్రి గంగుల ఆదేశించారు. అంతేకాకుండా క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తున్న తమ కుటుంబాలకు ఆరోగ్య భద్రత కల్పించాల్సిందిగా అసోసియేషన్ ప్రతినిధులు కోరడంతో గ్రూప్ ఇన్సూరెన్స్ ప్రతిపాధనలు, విధివిదానాలను సిద్దం చేయాల్సిందిగా ఉన్నతాధికారులను ఆదేశించారు మంత్రి.
ప్రతీ నిరుపేద కడుపునింపాలనే ప్రభుత్వ లక్ష్యం మేరకు రేషన్ డీలర్లు కృషి చేయాలని, ఈ నెల సంకల్పించిన 15 కిలోల ఉచిత బియ్యం పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా, బియ్యం పక్కదారి పట్టకుండా సరఫరా చేయాలని రేషన్ డీలర్లకు సూచించారు. ఈ విషయంలో ఎలాంటి అవకతవకలు జరిగిన కఠినంగా వ్యవహరిస్తామని, తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ నెల పంపిణీకి అవసరమైన 4 లక్షల 31 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సిద్దంగా ఉంచామని, ఐదో తారీఖు లోపు రేషన్ షాపులకు చేర్చి 87లక్షల 42వేల 590 కార్డుదారులకు జూన్ 5 నుండి పంపిణీ ప్రారంభిస్తామని అధికారులు మంత్రికి వివరించారు. ప్రభుత్వం రేషన్ డీలర్లకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తుందని, వారు కూడా విధినిర్వహణలో పూర్తి భాధ్యతతో వ్యవహరించి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పని చేయాలని మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ