తమ అభివృద్ధిని తామే నిర్వచించుకునే దిశగా చైతన్యమై, ఉత్పత్తిలో భాగస్వాములైన నాడే దళితుల సాధికారతకు నిజమైన అర్థం లభిస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. అనతి కాలంలో ఆర్థిక స్వావలంబన కలిగించే వినూత్న ఉపాధి స్కీంలను ‘తెలంగాణ దళిత బంధు’ పథకంలో భాగంగా రూపకల్పన చేసి లబ్ధిదారుల ముందుంచాలని సీఎం తెలిపారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ముందు అధికారులు సెన్సిటైజ్ కావడం, ఆ తర్వాత అర్హులైన లబ్ధిదారులను పథకం ఉపయోగించుకోవడంలో ఉద్ధీపన (సెన్సిటైజ్) చేయాలని సీఎం అధికారులకు తెలిపారు. రాష్ట్రంలోని దళితుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న ‘తెలంగాణ దళిత బంధు’ పథకం అమలు విధి విధానాలు, రూపొందించాల్సిన ఉపాధి పథకాలపై సోమవారం నాడు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, ‘‘క్షేత్రస్థాయిలో పైలట్ ప్రాజెక్టు నియోజకవర్గ గ్రామాల్లో పర్యటించి దళిత కుటుంబాల స్థితిగతులను అర్థం చేసుకోవాలి. వారి అభిప్రాయాలను సేకరించాలి. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వారికి అనువైన రీతిలో త్వరితగతిన ఆర్థిక స్థిరత్వాన్ని కలిగించే పలు రకాల పనులను గుర్తించి వాటిని పథకాలుగా మలచాలి. ముందు అధికారులు ప్రభుత్వ యంత్రాంగం ఆదిశగా సెన్సిటైజ్ కావాలి.’’ అని సీఎం వివరించారు. ఉన్నతాధికారులు ప్రభుత్వ యంత్రాంగం పైలెట్ ప్రాజెక్టు కేంద్రంగా ముందు అవగాహన పెంచుకోవాలని తెలిపారు. ఉపాధి కల్పించే పలు వినూత్న పథకాల రూపకల్పన కోసం క్షేత్రస్థాయి పర్యటనలను ఎలా చేపట్టాలి, ఆ సందర్బంగా ఎవరెవరిని కలవాలి, వారి నుంచి సమాచారం ఏ విధంగా తీసుకోవాలి, దళితుల అభ్యున్నతి కోసం పనిచేస్తున్న అనుభవజ్ఞుల సలహాలను పాటించి వారి సూచనలను పథకంలో భాగంగా ఎట్లా అమలు పరచాలి అనే అంశాల మీద ముందుగా అధికారులు సెన్సిటైజ్ కావాలని సీఎం సూచించారు.
ఇందులో భాగంగా ఉన్నతాధికారులు, ఉద్యోగులు, దళిత ప్రముఖులు, దళిత సంఘాల నేతలు, యాక్టివిస్టులతో కూడిన వర్క్ షాపు త్వరలో నిర్వహించనున్నట్టు సీఎం తెలిపారు. వర్క్ షాప్ లో తీసుకున్న నిర్ణయాలను అనుసరించి పైలట్ ప్రాజెక్టు చేపడుతున్న నియోజకవర్గంలోని దళిత వాడలకు వెళ్లాలని, అక్కడ దళిత కుటుంబాలతో మాట్లాడాలని, దళిత సమస్యలపై అవగాహన వున్న దళిత ప్రముఖులను కలవాలని వారి సలహాలు సూచనలతో స్కీంలను రూపొందించాలని సీఎం తెలిపారు. దళితుల అవసరాలు ఎట్లున్నయి? అర్హులైన లబ్ధిదారులకు పథకం అందించగానే ఎక్కువకాలం గ్యాప్ లేకుండా ఆదాయం సృష్టించుకునే విధంగా వుందా లేదా గుర్తించి పథకం రూపకల్పన చేయాలన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఎస్సీ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఎండీ పి.కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ