పెగాసస్ స్పైవేర్ అంశంపై దేశంలో ఒక్కసారిగా దుమారం చెలరేగింది. పెగాసస్ స్పైవేర్ సాయంతో దేశంలో పలువురు ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, కేంద్రమంత్రుల ఫోన్లు హ్యాకింగ్ చేసినట్లు వార్తలు రావడంతో సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. కీలక నేతల ఫోన్లపై నిఘా ఉన్నట్టు వార్తలు రావడంతో ప్రతిపక్ష పార్టీలు ఈ అంశంపై దృష్టి సారించాయి. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో పెగాసస్ స్పైవేర్ అంశంపై చర్చకు పట్టుపట్టాలని నిర్ణయించుకున్నాయి. కాగా సోమవారం నాడు లోక్సభలో కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పెగాసస్ స్పైవేర్ తో ఫోన్లు హ్యాకింగ్ చేసినట్టు వచ్చిన వార్తలపై ప్రకటన చేశారు. దేశ ప్రజాస్వామ్యాన్ని కించపరిచే ప్రయత్నంగా, ఉద్దేశపూర్వకంగానే ఈ కథనాలను ప్రచారం చేస్తున్నారంటూ పేర్కొన్నారు. “పార్లమెంటు వర్షాకాల సమావేశానికి ఒక రోజు ముందు ఈ వార్తలు వచ్చాయి. ఇది యాదృచ్చికం కాదు. గతంలో వాట్సాప్లో కూడా పెగాసస్ వాడకం గురించి ఇలాంటి వాదనలు వచ్చాయి. ఆ నివేదికలకు ఎలాంటి వాస్తవిక ఆధారం లేదు మరియు సుప్రీంకోర్టుతో సహా అన్ని పార్టీలు దీనిని ఖండించాయి” అని మంత్రి పేర్కొన్నారు.
“అలాగే ఈ నివేదిక యొక్క ఆధారంగా లీకైన ఫోన్ నంబర్ల డేటాబేస్ ఉంది. డేటా బేస్ లో ఫోన్ నంబర్ ఉండటం వల్ల ఆ పరికరంకు పెగాసస్ సోకిందా లేదా హ్యాకింగ్కు గురైనట్లు ఆ కథనం స్పష్టంగా చెప్పలేదు. ఫోన్ను సాంకేతికంగా విశ్లేషించకుండా హ్యాకింగ్కు గురైందా లేదా అనేది చెప్పడం సాధ్యం కాదు. డేటాబేస్ లో నంబర్లు ఉండడం స్నూపింగ్కు సమానం కాదని నివేదిక స్వయంగా స్పష్టం చేస్తుంది” అని అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం సంచలనం కోసమే ఇలాంటి కథనాలు తీసుకొస్తున్నారని చెప్పారు. మరోవైపు పెగాసస్ ను అభివృద్ధి చేసిన ఇజ్రాయెల్ కు చెందిన సంస్థ ఎన్ఎస్ఓ, పెగాసస్ ను ఉపయోగించినట్టు చూపిన దేశాల జాబితా తప్పుగా ఉన్నట్టు పేర్కొందన్నారు. అనేక దేశాలు తమ క్లయింట్లు కూడా కాదని, తన ఖాతాదారులలో ఎక్కువ మంది పాశ్చాత్య దేశాలు అని తెలిపినట్టు మంత్రి పేర్కొన్నారు. అలాగే దేశంలో అనధికార నిఘా జరగకుండా చూసేందుకు వ్యవస్థలు ఎంతో పటిష్టంగా ఉన్నాయని మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ