ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న ‘అమ్మ ఒడి’ పథకానికి సంబంధించి నవంబర్ 22, శుక్రవారం నాడు పాఠశాల విద్యాశాఖ నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. నవంబర్ 30 లోగా అమ్మ ఒడి అర్హుల జాబితాను రూపొందించే ప్రణాళికను ప్రకటించింది. ఈనెల 17 నుంచి 21 వరకు ఆంధ్రప్రదేశ్ లోని విద్యాసంస్థలు తమ తమ స్కూళ్లలోని విద్యార్థుల డేటాను ‘చైల్డ్ ఇన్ఫో’ లో నమోదు చేశారు. చైల్డ్ ఇన్ఫో లో ఇప్పటికే నమోదైన సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్, సర్వీసెస్కు(ఏపీసీఎఫ్ఎస్ఎస్) అందించారు. అనంతరం ఈ సమాచారాన్ని తెల్లరేషన్కార్డులలోని జాబితా, సమాచారంతో అనుసంధానించి, ఆ వివరాలను పాఠశాలల హెడ్ మాస్టర్లకు అందుబాటులో ఉంచుతారు.
అమ్మ ఒడి అర్హుల జాబితాను రూపొందించే షెడ్యూల్:
- నవంబర్ 24వ తేదీన హెడ్ మాస్టర్లకు యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తారు. వారు గతంలో పంపిన డేటాను, ఏపీసీఎఫ్ఎస్ఎస్ ఇచ్చిన డేటాతో సరిపోల్చి చూస్తారు. ఆ సమాచారాన్ని ఎంఈఓలకు అందజేయాలి
- అనంతరం హెడ్ మాస్టర్లు విద్యార్థి తల్లి లేదా సంరక్షకుల ఆధార్ నెంబరు, నివాస గ్రామం, బ్యాంక్ ఖాతా సంఖ్య, ఐఎఫ్ఎస్సీ కోడ్ సేకరించాలి
- పాఠశాలల్లో 100 లోపు విద్యార్థులుంటే ఆన్లైన్లో వారి వివరాల నమోదును నవంబర్ 25 వ తేదీ లోపు పూర్తి చేయాలి
- పాఠశాలల్లో 100 నుంచి 300 మంది విద్యార్థులుంటే ఆన్లైన్లో వారి వివరాల నమోదును నవంబర్ 26వ తేదీ లోపు పూర్తి చేయాలి
- పాఠశాలల్లో 300, అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులుంటే ఆన్లైన్లో వారి వివరాల నమోదును నవంబర్ 27వ తేదీ లోపు పూర్తి చేయాలి
- హెడ్ మాస్టర్లు సేకరించిన సమాచారాన్ని ఎంఈవోలు ప్రింట్ చేసి, గ్రామ సచివాలయ విద్యాసంక్షేమ సహాయకునికి అందించాలి లేదా సీఆర్పీలకు ఇవ్వాలి
- గ్రామ సచివాలయ విద్యాసంక్షేమ సహాయకులు క్షేత్రస్థాయిలో కుటుంబాల పరిశీలించి, తెల్లరేషన్కార్డు, బ్యాంకు ఖాతా నెంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ తదితర వివరాలు సేకరించాలి.
- ఒకవేళ పిల్ల తల్లిదండ్రులకు రేషన్కార్డులు లేకుంటే ఆరు అంచెల పరిశీలన ద్వారా వారు నిరుపేదలు లేదా అమ్మ ఒడి పథకానికి అర్హులేనన్న అంశాన్ని ధ్రువీకరించుకోవాలి.
- నవంబర్ 30వ తేదీలోగా ఈ ప్రక్రియనంతా పూర్తి చేసి, గ్రామ సచివాలయ సిబ్బంది పూర్తీ సమాచారాన్ని ఎంఈఓలకు అందజేయాలి.
[subscribe]