కేంద్ర హోంశాఖ ఇటీవల విడుదల చేసిన భారతదేశ పొలిటికల్ మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరు లేకపోవడంతో దుమారం రేగి రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అమరావతి లేకుండా కేంద్ర హోంశాఖ భారతదేశ పొలిటికల్ మ్యాప్ ను విడుదల చేయడంపై గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్ సభలో ప్రశ్నించారు. మ్యాప్ లో అమరావతి లేకపోవడం వలన ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, ప్రాంతాన్ని అవమానించడమే కాకుండా, స్వయంగా హాజరై, శంకుస్థాపన చేసిన దేశ ప్రధాని నరేంద్ర మోదీని కూడ అవమానించినట్టు అయిందని అన్నారు. తప్పును సరిదిద్ది, అమరావతితో కూడిన కొత్త మ్యాప్ను విడుదల చేయాలని ఎంపీ గల్లా జయదేవ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో ఎంపీల అభ్యర్ధనను పరిగణనలోకి తీసుకుని, అమరావతిని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా కొత్త పొలిటికల్ మ్యాప్ను విడుదల చేసింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. అమరావతితో కూడిన కొత్త మ్యాప్ను కూడా ఈ సందర్భంగా షేర్ చేశారు.
[subscribe]