ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 15 నుంచి ఏపీలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను పూర్తి స్థాయిలో అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం వైద్య ఆరోగ్యశాఖపై నిర్వహించిన సమీక్షలో ప్రకటించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, ముఖ్య కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ (మెడికల్ అండ్ హెల్త్) ఎంటి కృష్ణబాబు, కమిషనర్ జె నివాస్, ఆరోగ్యశ్రీ సీఈఓ హరేందిర ప్రసాద్, ఏపీ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్-ఛైర్మెన్ డి మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇక ఫేజ్-3లో భాగంగా మిగిలినవారికి ‘వైఎస్సార్ కంటి వెలుగు’ కార్యక్రమాన్ని వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులతో మాట్లాడుతూ.. విలేజ్ క్లినిక్లో ఫ్యామిలీ డాక్టర్ సేవలందించేలా ఏర్పాట్లు చేయాలని, ఆరోగ్యశ్రీ పథకంలోని రెఫరల్ సేవలను కూడా ఇందులో భాగం చేయాలని సూచించారు. ఈ క్రమంలో ఫ్యామిలీ డాక్టర్ పైలట్ ప్రాజెక్టులో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 45,90,086 మందికి ఆరోగ్య సేవలు అందించామని సీఎం జగన్కు అధికారులు వివరించారు. అలాగే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి వైద్యశాఖ సర్వం సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు.
వైద్య ఆరోగ్యశాఖపై సమీక్షలో సీఎం జగన్ చేసిన కొన్ని కీలక సూచనలు..
- వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం మొదటి దశల్లో బీమా అందని వారికి మూడో దశలోనే వ్యాధి నిర్ధారణ చేసి వారికి ఉచితంగా సహాయం అందించాలి.
- పాఠశాలల్లో పిల్లల కంటి చూపును తనిఖీ చేయడం, ఆరోగ్యశ్రీ పథకం కింద గ్లాకోమా మరియు డయాబెటిక్ రెటినోపతికి చికిత్స అందించడానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి.
- కంటిచూపు సమస్యలపై ప్రజలకు వార్డు, గ్రామ సచివాలయాల వద్ద పరీక్షలు నిర్వహించాలి.
- మార్చి 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను పూర్తి స్థాయిలో అమలు చేయాలి.
- అదే రోజు ఓ విలేజ్ క్లినిక్ వద్ద దీనిని ప్రారంభించాలి, దీనికోసం 1,149 పీహెచ్సీల్లో పూర్తిస్థాయిలో వైద్యుల నియమాకాలు పూర్తి.
- ప్రతి జిల్లాకు నలుగురు అదనపు వైద్యులను ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కోసం నియమించుకోవాలి.
- మొత్తం 10,032 విలేజ్హెల్త్ క్లినిక్స్లో ప్రతి క్లినిక్కూ ఒక ఏఎన్ఎం చొప్పున ఉండేలా చూసుకోవాలి.
- అలాగే వీరితో పాటు ఒక సీహెచ్ఓ, 3–4 మంది ఆశా కార్యకర్తలు కూడా తప్పనిసరిగా ఉండాలి.
- 105 రకాల మందులు సహా 14 రకాల డయాగ్నోస్టిక్ కిట్లను విలేజ్ క్లినిక్స్లో అందుబాటులో ఉంచాలి.
- పీహెచ్సీలను, 104 అంబులెన్స్లను అనుసంధానం చేస్తూ మ్యాపింగ్ చేయాలి.
- లబ్ధిదారులకు ఇచ్చే కార్డులపై ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించిన ఫిర్యాదులను నమోదు చేసే ఫోన్ నంబర్ను ముద్రించాలి.
- ఫ్యామిలీ డాక్టర్లు సాధారణ ఔట్ పేషెంట్లు, గర్భిణీ స్త్రీలు, అంగన్వాడీ కేంద్రాలు మరియు పాఠశాలల్లోని పిల్లలకు సేవలందిస్తారు.
- ఫ్యామిలీ డాక్టర్లు ముఖ్యంగా రక్తహీనత కేసుల చికిత్సకు తగిన ప్రాధాన్యత ఇస్తారు.
- దీర్ఘకాలికంగా మంచం మీద ఉన్న రోగులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.
- వారు నిర్వహించే కేసులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా రూపొందించిన డేటాబేస్లో పొందుపరుస్తారు.
- తద్వారా ఆయా రోగుల తదుపరి సేవలకు ఫాలో-అప్లను చేయడంలో సహాయపడుతుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE