జైళ్లలో ఖైదీల పట్ల జరుగుతున్న కుల వివక్ష పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖైదీలను కులవివక్ష ఆధారంగా వేరుగా చూడరాదని కోర్టు చెప్పింది. అన్ని కులాలకు చెందిన ఖైదీలను మానవత్వంతో, సమానంగా చూడాలని కోర్టు తెలిపింది. కొన్ని రాష్ట్రాల్లో కులం ఆధారంగా ఖైదీలకు పనుల అప్పగింత, జైలులో గదుల కేటాయింపునకు సంబంధించిన నిబంధనలను తప్పుబట్టింది. అభ్యంతరకరంగా ఉన్న నిబంధనలను మూడు నెలల్లో మార్చాలని పలు రాష్ట్రాలకు సూచించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
అన్ని కులాలకు చెందిన ఖైదీలను మానవత్వంతో, సమానంగా చూడాలని కోర్టు తెలిపింది. జైళ్లలో ఉన్న ఖైదీలకు పని విషయంలో సమాన హక్కు కల్పించాలని కోర్టు వెల్లడించింది. ప్రమాదకర పరిస్థితుల్లో ఉండే సీవేజ్ ట్యాంక్లను ఖైదీలు శుభ్రం చేసే అనుమతి ఇవ్వకూడదని కోర్టు చెప్పింది. రాష్ట్ర జైలు మాన్యువల్స్లో ఉన్న అభ్యంతరకర రూల్స్ను కోర్టు కొట్టిపారేసింది. ఓ కులానికి చెందిన వ్యక్తులనే స్వీపర్లుగా ఎంపిక చేయడం సరైన విషయం కాదు అని కోర్టు చెప్పింది.
జైళ్లలో కుల ఆధారిత వివక్ష, విభజన ఉందని ఆరోపిస్తూ మహారాష్ట్రలోని కల్యాణ్కు చెందిన సుకన్య శాంత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ ఏడాది జనవరిలోనే కేంద్రంతో పాటు ఉత్తర్ప్రదేశ్, బంగాల్ సహా 11 రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు స్పందించిన ఆయా రాష్ట్రాలు ఖైదీలకు కులం ఆధారంగానే పనులు ఇవ్వడం, జైలులో గదులను కేటాయిస్తున్నట్లు పేర్కొన్నాయి. దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. జైలు మాన్యువల్స్లో ఉన్న ఇలాంటి అభ్యంతరకర నిబంధలను సవరించాలని ఆయా రాష్ట్రాలను ఆదేశించింది.