ఏపీలో మరో రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. అనంతపురం మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు. దీపావళి, ఛత్ పండగల అనంతరం ప్రజలు తిరుగు ప్రయాణం అవుతుండటంతో రైళ్లల్లో రద్దీ నెలకొంటోంది. పండగల సమయంలోనే కాకుండా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉందనుకుంటే ఒకరోజు ముందుగా ప్రకటించి ప్రత్యేక రైలును ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని నివారించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను అనంతపురం మీదుగా నడుపుతోంది.
ఈనెల 12, 19వ తేదీల్లో బెంగళూరు నుంచి బరౌనికి ప్రత్యేక రైలు (06563) రాత్రి 9.15 నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 8 గంటలకు బరౌనీ చేరుకుంటుంది. ఈ రైలు ధర్మవరం, అనంతపురం, డోన్ మీదుగా వెళ్తుందని చెప్పారు. ఈ ప్రత్యేక రైలు (06564) తిరుగు ప్రయాణంలో బరౌనీలో ఈనెల 15, 22వ తేదీల్లో సాయంత్రం 5.30కు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6 గంటలకు ఇదే రూట్లో బెంగళూరుకు చేరుకుంటుంది.
యశ్వంతపూర్- ముజఫర్పూర్ మధ్య నడుస్తున్న మరో రెండు ప్రత్యేక రైళ్లు కూడా అనంతపురం మీదుగా ప్రయాణిస్తాయి. ఈనెల 13వ తేదీ ఉదయం 7.30 గంటలకు 06229 యశ్వంతపూర్లో బయలుదేరి ధర్మవరం, అనంతపురం, డోన్ మీదుగా తర్వాత రోజు ఉదయం 9.45కు ముజఫర్పూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 06230 నెంబరుతో ముజఫర్పూర్లో 16వ తేదీ ఉదయం 10.45కు బయలుదేరి తర్వాతరోజు ఉదయం 10.30కు యశ్వంతపూర్ చేరుకుంటుంది.
యశ్వంతపూర్ నుంచి దానాపూర్కు మరో ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈనెల 14, 21వ తేదీల్లో ఈరైలు (06271) యశ్వంతపూర్లో ఉదయం 7.30కు బయలుదేరి ధర్మవరం, డోన్ మీదుగా ప్రయాణించి దానాపూర్కు రెండో రోజు ఉదయం 6 గంటలకు చేరుకుంటుంది. 17, 24వ తేదీల్లో ఉదయం 8 గంటలకు దానాపూర్లో రైలు (06272) బయలుదేరి రెండో రోజు ఉదయం 10.30కు యశ్వంతపూర్ చేరుకుంటుంది. ఈరైలు అనంతపురంలో ఆగదని తెలిపారు.