మే 12 న అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నర్సులందరికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. “రోగులకు స్వస్థత చేకూర్చడంలో నర్సులు పోషించే క్రియాశీలక పాత్రను ఏ ఒక్కరూ మరువరు. కరుణతో రోగులను సంరక్షిస్తున్న గౌరవప్రదమైన, బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న ప్రతి నర్సుకీ నా తరఫున, జనసేన తరఫున అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. వృత్తిరీత్యా నర్సు అయినా ఆసుపత్రిలో వినిపించేది సిస్టర్ అనే మాటే. ఆ పిలుపుతోనే తమ కుటుంబ సభ్యులకు చేసే సేవగా భావించి సపర్యలు చేస్తారని” పవన్ కళ్యాణ్ చెప్పారు
“కరోనా మహమ్మారి విజృంభించిన ఈ విపత్కర సమయంలో ఆసుపత్రుల్లో, ఐసోలేషన్ వార్డుల్లో నర్సులు సాహసంతో తమ విధులు నిర్వర్తిస్తున్నారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ వారసత్వాన్ని కరోనా సమయంలో నర్సులు కొనసాగిస్తున్న తీరు సర్వదా ప్రశంసనీయం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య ఫలితాలను సాధించడంలో నర్సింగ్ విభాగం చాలా అవసరం అనీ, సమర్థమైన నర్సులు మరింతమంది రావాలనే విషయాన్ని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వృత్తిలో ఉన్న వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ, గౌరవప్రదమైన వేతనాలు అందించేలా ప్రభుత్వాలు దృష్టి సారించాలని” పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]