ఉగాది కానుకగా తెలంగాణ కేబినెట్ విస్తరణ.. నలుగురికి మంత్రివర్గంలో అవకాశం!

Telangana Cabinet Expansion For Ugadi Four New Ministers To Take Oath

తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉగాది కానుకగా విస్తరణ జరగనున్నట్టు సంకేతాలు వచ్చాయి. మొత్తం నాలుగు కొత్త మంత్రులు, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవుల భర్తీకి కాంగ్రెస్ అగ్రనేతలు అంగీకారం తెలిపారు. అయితే, కేబినెట్‌లో ఇంకా రెండు పదవులను పెండింగ్‌లో పెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ఈ మేరకు ఢిల్లీలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు పార్టీ అధిష్టానంతో చర్చించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు, పథకాల అమలు, పార్టీ బలోపేతం వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా, కేబినెట్ విస్తరణపై కూడా విశ్లేషించారు.

కాంగ్రెస్ పార్టీ మార్పును నినాదంగా తీసుకుని అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరైంది. కానీ, కేబినెట్ విస్తరణ ఆలస్యం కావడంతో ఆశావహులు నిరీక్షణలో ఉన్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో 12 మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. మొత్తం 18 మందికి అవకాశం ఉండగా, ఇప్పుడు మరో నలుగురికి చోటు కల్పించనున్నారు.

ఈ పదవులకు సంబంధించి పలు పేర్లు వినిపిస్తున్నాయి. ఎస్టీ కోటాలో దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్ తనకు మంత్రి పదవి రావాలని ఆశిస్తున్నారు. సీనియర్ నేత జానారెడ్డి ఆశీర్వాదంతో ఆయన గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే, నల్లగొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తనకు అవకాశం దక్కుతుందని ధీమాగా ఉన్నారు. మైనార్టీ కోటాలో పోటీ తీవ్రంగా ఉంది. రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరుగుతోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తనకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

కేబినెట్ విస్తరణ ఖాయమని సంకేతాలు వచ్చాయి. ఏప్రిల్ 8, 9 తేదీల్లో గుజరాత్‌లో జరిగే ఏఐసీసీ సమావేశాలకు భట్టి విక్రమార్కను ఎంపిక చేశారు. ఈ విస్తరణలో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయనేది ఆసక్తిగా మారింది.