ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు.అయితే ఇవాళ తిరుపతిలో వారాహి డిక్లరేషన్ సభ ఉంది.. అయితే జ్వరం ఉన్నా సరే సాయంత్రం జరిగే వారాహి డిక్లరేషన్ సభకు పవన్ కళ్యాణ్ హాజరవుతారని జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మంగళవారం నాడు తిరుమల మెట్లు ఎక్కిన తర్వాత అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలో ఆయన వెన్నునొప్పితో బాధపడ్డారు. ఈ క్రమంలోనే నిన్న శ్రీవారిని దర్శించుకున్న జనసేనాని.. రాత్రి తిరుమలలోనే బస చేశారు. దాంతో అస్వస్థతకు గురైన పవన్ను తిరుమలలోని అతిథి గృహంలోనే వైద్య సేవలు అందిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్నా ఇవాళ సాయంత్రం తిరుపతిలో నిర్వహించే వారాహి సభలో ఆయన పాల్గొంటారని పార్టీ శ్రేణులు వెల్లడించాయి. ఈరోజు సాయంత్రం తిరుపతి బాలాజీ కాలనీలోని జ్యోతిరావు పూలే కూడలిలో వారాహి బహిరంగ సభ ఉండనుంది. ఈ సభలో వారాహి డిక్లరేషన్ అంశాలను వివరించనున్నారు.
డిక్లరేషన్ ద్వారా పవన్ సనాతన ధర్మం అమలులో భాగంగా కీలక అంశాలను ప్రస్తావించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పవన్ డిమాండ్ కు మద్దతుగా సనాతన ధర్మ రక్షణ బోర్డ్ అనే పేరుతో హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లో కూడా ఉంది. కాగా, తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం నేపథ్యంలో పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. 11 రోజులపాటు సాగిన దీక్షను బుధవారం శ్రీవారి దర్శనం తర్వాత విరమించారు.