తూర్పుగోదావరి జిల్లాకి చెందిన ఓ బాలికపై సామూహిక అత్యాచార ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. “రాజమహేంద్రవరంలో కుటుంబ పోషణ కోసం ఓ దుకాణంలో పని చేస్తున్న 16 ఏళ్ల బాలికపై కొందరు కామాంధులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారనే వార్త తీవ్రంగా కలచివేసింది. అమానుషకరమైన ఈ ఘటన హృదయం ఉన్న ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది. నాలుగు రోజులపాటు చిత్ర హింసలకు గురి చేసిన ఆ మృగాళ్లను కఠినంగా శిక్షించాలి. తన కుమార్తె ఆచూకీ తెలియడం లేదని తల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సకాలంలో స్పందించలేదని తెలిసింది. మహిళలపై అత్యాచారాలు నిరోధానికి తీసుకువచ్చిన దిశ చట్టం ఏమైపోయింది? అసెంబ్లీలో ముక్తకంఠంతో ఆమోదం పొందిన ఆ చట్టం ఇంకా ఎందుకు అమలు కావడం లేదు? తొలి దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటైన రాజమహేంద్రవరంలోనే సామూహిక అత్యాచార ఘటన చోటు చేసుకొంది. దిశ పేరుతో ఏర్పాటైన ఆ ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏం చేస్తున్నాయి. ఈ సామూహిక అత్యాచారం వెనక గంజాయి, డ్రగ్స్ ముఠాలు ఉన్నాయనీ ఇది బ్లేడ్ బ్యాచ్ పనే అని ఆ నగరవాసులు ఆందోళన చెందుతున్న విషయాన్ని పోలీస్ అధికారులు పరిగణనలోకి తీసుకోవాలి. అలాంటి ముఠాల ఆగడాలకు కళ్ళెం వేయకపోతే రక్షణ కరవవుతుంది. చట్టం చేయడం కాదు, వాటిని నిబద్ధతతో అమలు చేస్తేనే మహిళలకు రక్షణ కలుగుతుందని” పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu