రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం సాయంత్రం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మార్చ్ 31వ తేదీ వరకు రాష్ట్రాన్ని లాక్డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు. అత్యవసర సేవలు మినహా, మిగతా అన్ని రకాల సేవలను నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారు.
సీఎం వైయస్ జగన్ ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు:
- మార్చ్ 31 వరకు ఆంధ్రప్రదేశ్ లో లాక్డౌన్. ప్రజలంతా ఇళ్లకే పరిమితం అవ్వాలి, పదిమంది మించి ఎక్కడా గుమికూడకూడదు.
- రాష్ట్ర సరిహద్దులన్ని మూసివేత.
- మార్చ్ 29వ తేదీన పేదలకు ఉచితంగా రేషన్ అందజేస్తాం. రేషన్ తో పాటు కేజీ పప్పు ఉచితంగా అందజేస్తాం.
- ప్రతి ఇంటికి ఏప్రిల్ 4వ తేదీన వెయ్యి రూపాయల ఆర్థిక సాయం.
- నిత్యావసర వస్తువుల ధరలను పెంచి ప్రజలను ఇబ్బంది పెడితే కఠినమైన చర్యలు తీసుకుంటాం.
- విదేశాల నుంచి ఎవరు వచ్చినా 14 రోజుల పాటు తప్పనిసరిగా ఇంటి లోనే ఉండాలి.
- రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
- రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2.50 లక్షల గ్రామ వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి సమీక్ష చేసి, పరిస్థితులను ప్రభుత్వానికి నివేదిక ఇస్తున్నారు.
- నియోజకవర్గ కేంద్రంలో వంద పడకల ఐసోలేషన్ సెంటర్లు, జిల్లా కేంద్రంలో 200 పడకల ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం.
- ఎవరైనా దగ్గు, జ్వరం, జలుబు లక్షణాలతో బాధ పడుతుంటే వెంటనే 104 నెంబర్ కి ఫోన్ చేయండి.
- మార్చ్ 31వ తేదీ వరకు అన్ని రకాల విద్యా సంస్థలకు ఇప్పటికే సెలవులు ప్రకటించాం.
- 10వ తరగతి పరీక్షలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి.
- రవాణా వ్యవస్థను కూడా కట్టడి చేస్తాం, అత్యవసర సమయాల్లో లేదా తప్పనిసరి అయితేనే ఆటోలు, టాక్సీలు ఉపయోగించుకోవాలి.
- గోల్డ్ షాపులు, బట్టల షాపులు కూడా 31 వరకు మూసివేయాలి.
- రాష్ట్ర సచివాలయంలో కూడా పలు రకాల ఆంక్షలు విధించాం.
- అత్యవసర విభాగాల ఉద్యోగులు తప్ప మిగతా ప్రభుత్వ ఉద్యోగులను రొటేషన్ పద్ధతిలో విధులు నిర్వహించేలా చూస్తాం.
- ఇక ప్రజలకు నిత్యావసరలైనా నీళ్లు, కూరగాయలు, మందుల షాపులు, కరెంట్, టెలికాం, పెట్రోల్ పంపిణీ వంటి సేవలు అందుబాటులోనే ఉంటాయి.
- ఇంటిలో పెద్దవాళ్ళను బయటికి రాకుండా చూసుకోవాలి.
- ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించి, ఈ కరోనా మహమ్మారిపై కలిసికట్టుగా యుద్ధం చేయాలి.
- వీలైనంత త్వరలోనే బడ్జెట్ సమావేశాలు నిర్వహించి, మిగతా కేటాయింపులపై కూడా దృష్టి పెడతాం.
- మార్చ్ 31వ తేదీ తర్వాత పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటాం.