తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేడు 40వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుంది. ముందుగా మార్చి 29, 1982న హైదరాబాద్ లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించనున్నట్టు ప్రకటించారు. నేడు టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులందరికీ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
“నలభై సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ చేతుల మీదుగా తెలుగుదేశం ఆవిర్భావం, ఒక రాజకీయ అనివార్యం. కొందరు వ్యక్తుల కోసమో, కొందరికి పదవుల కోసమో ఏర్పడిన పార్టీ కాదు మన తెలుగుదేశం. ప్రజల కోసం, ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం. పేదలకు కూడు, గూడు, గుడ్డ నినాదంతో నాడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం, ఈ 40 ఏళ్లలో సామాన్య ప్రజల జీవితాల్లో పెను మార్పులు తెచ్చింది. కొందరికే పరిమితం అయిన అధికారాన్ని అన్ని వర్గాలకు పంచింది. తెలుగుదేశం అంటేనే అభివృద్ధి, సంక్షేమం. సంస్కరణల ఫలితాలను గ్రామ స్థాయికి అందించిన చరిత్ర టీడీపీదే. పాలనపై పాలకులను ప్రశ్నించే తత్వాన్ని ప్రజలకు నేర్పింది తెలుగుదేశమే. పార్టీ చారిత్రక ప్రాధాన్యాన్ని గుర్తుకుతెచ్చేలా తెలుగుదేశం 40 వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహించండి. ప్రతి ఒక్కరూ పార్టీ కోసం పునరంకితం అయ్యేలా ఈ వేడుకలు ఉండాలి. రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అవసరం ఏంటో ప్రజలకు వివరించేలా కార్యక్రమాలు సాగాలి” అని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ