టమోటా ధరలు మరోసారి పెరిగాయి. ఏకంగా కిలో టమోటా ధర రూ 100 వరకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల వ్యవధిలోనే టమోటా ధరలు ఒక్కసారిగా పెరిగాయి. రెండు రోజుల క్రితం వరకు కిలో రూ.80 పలకగా శుక్రవారం రూ.100కు చేరింది. ఇరవై రోజుల క్రితం కిలో టమాట రూ.30 నుంచి రూ.40 పలకగా, ఐదు రోజుల క్రితం వరకూ రూ.60 చొప్పున అమ్మకాలు చేశారు. ప్రస్తుతం హోల్సేల్ వ్యాపారులు కిలో టమాట రూ.80కి విక్రయిస్తుంటే, రిటైల్ వ్యాపారులు రూ.100కు విక్రయిస్తున్నారు. డిమాండ్కు సరిపడా దిగుబడులు లేకపోవడం వల్లే ధరలు పెరిగాయని వ్యాపారులు భావిస్తున్నారు. ప్రతి ఏటా ధరల హెచ్చు తగ్గుదలతో టమాట తోటల సాగుపై రైతులు ఆసక్తి చూపకపోవడంతో పొరుగు రాష్ట్రాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పొరుగు రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాల్సి వస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. తెలంగాణ, ఏపీలోని బహిరంగా మార్కెట్లలో టమోటా ధరలు కిలో రూ 100 వరకు ఉండటంతో అమ్మకాలు పూర్తిగా తగ్గాయి.
వరదల కారణంగా ఒక్కసారిగా పెరిగిన ధరలు
నాలుగైదు నెలల క్రితం మెదక్, నిజామాబాద్ జిల్లాల నుంచి టమాట దిగుమతి చేసుకున్నారు. అయితే ఇటీవల వర్షాల వల్ల తోటలు దెబ్బ తినడంతో ఆయా ప్రాంతాల నుంచి దిగుమతి నిలిచిపోయింది. ఆంధ్రప్రదేశ్లోని కల్యాణదుర్గం, మదనపల్లి తదితర ప్రాంతాల నుంచి వచ్చే టమాట పరిస్థితీ అంతే. ఇటీవల వరదలకు అక్కడి తోటలూ దెబ్బ తినడంతో అక్కడి హోల్సేల్ వ్యాపారులు ధరను ఒక్కసారిగా పెంచేశారు. ఏపీలో 22 కిలోల బాక్స్కు రూ.1,550 (కిలో రూ.70) చొప్పున అమ్ముతుండగా, రవాణా, ఇతర ఖర్చులతో కలిపి ఇక్కడి మార్కెట్లో హోల్సేల్గా రూ.80కు అమ్ముతున్నట్లు వ్యాపారులు అంటున్నారు. అదే రిటైల్ వ్యాపారులు మరో రూ.20 పెంచేసి వినియోగదారులకు అమ్ముతున్నారు. మొత్తంగా 20 రోజుల క్రితం రూ.30 నుంచి రూ.40 పలికిన టమాట ధరలు, ప్రస్తుతం కొండెక్కి రూ.100పై కూర్చున్నాయి.
పెరుగుతున్న ఉల్లి ధర
ఉల్లి దిగుమతులు తగ్గడంతో ఏపీలో వీటికి డిమాండ్ ఏర్పడింది. దీంతో ఉల్లి కూడా సెంచరీకి చేరువయింది. గతవారం కొత్త ఉల్లి కిలో రూ.40, పాత ఉల్లి రూ.60 ఉండగా, ఇప్పుడు పాత ఉల్లిపాయలు రూ.80పైనే పలుకుతున్నాయి. ఇక మహారాష్ట్రలో నాణ్యమైన ఉల్లి క్వింటా రూ.3,500 వరకు పలుకుతోంది. దీంతో ఏపీ మార్కెట్లో పాత ఉల్లిని కొందరు బయటకు తీయడంలేదు. ధర తక్కువగా ఉన్న కొత్త సరుకును రిటైల్ మార్కెట్లో అమ్మేస్తున్నారు. ఇవే రకం ఇంటి ముందు తోపుడు బండ్లపై రూ.100కు 2కిలోలు ఇస్తున్నారు. రైతుబజార్లలో ఉల్లి రూ.40చొప్పున విక్రయిస్తున్నా.. సరుకు నాణ్యత ఉండటం లేదని వినియోగదారులు చెప్తున్నారు. దసరా పండుగ లోపే ఉల్లి కూడా కిలో వందకు చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.