సామాన్య భక్తులకు ఎక్కువ సంఖ్యలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో జనవరి 2వ తేదీ నుండి 11వ తేదీ వరకు 10 రోజుల పాటుగా వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని బోర్డు నిర్ణయం తీసుకుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్టు చెప్పారు. మంగళవారం సాయంత్రం తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జిల్లా కలెక్టర్ వెంకటరమణా రెడ్డి, అదనపు ఈవో వీరబ్రహ్మం, జేఈవో సదా భార్గవి, టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్, జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి, ఇతర అధికారులతో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై వైవీ సుబ్బారెడ్డి సమీక్ష జరిపారు. ఈ సమీక్ష సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.
భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని 9 ప్రాంతాల్లో దాదాపు 92 కౌంటర్ల ద్వారా సర్వదర్శనం టోకెన్లు జారీ చేయడం జరుగుతుంది. జనవరి 2 నుండి 11వ తేదీ వరకు 10 రోజులకు గాను జనవరి 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రారంభిస్తామని చెప్పారు. 10 రోజుల కోటా పూర్తయ్యేంత వరకు నిరంతరాయంగా 4 లక్షల 50 వేల టోకెన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామని, భక్తులకు త్వరితగతిన దర్శనం చేయడం కోసం చేసిన ఈ ఏర్పాట్లను గమనించి భక్తులు టోకెన్ తీసుకున్నాకే తిరుమలకు రావాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో భూదేవి కాంప్లెక్స్, ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, జీవకోన జడ్పీ హైస్కూల్, విష్ణునివాసం, శ్రీనివాసం, బైరాగిపట్టెడలోని రామానాయుడు పాఠశాల(మహాత్మాగాంధీ మున్సిపల్ హైస్కూల్), ఎమ్.ఆర్ పల్లి పోలీస్ స్టేషన్ వెనుక వైపున గల శేషాద్రి నగర్లోని జెడ్పి హైస్కూల్, గోవిందరాజ స్వామి సత్రాల వద్ద టోకెన్లు జారీ చేస్తామన్నారు.
జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ సహకారంతో ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఈ టోకెన్ కేంద్రాల వద్ద భక్తుల కొరకు అన్నప్రసాదాలు, మంచినీరు, పాలు, టి, కాఫీ అందిస్తాం. తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. తిరుమల స్థానికుల కోసం కౌస్తుభం విశ్రాంతి గృహంలో కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఉచిత టోకెన్లు పొందిన భక్తులు తిరుమలలోని కృష్ణతేజ విశ్రాంతి గృహం వద్ద రిపోర్టు చేయాలి. తిరుపతిలో 9 ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన సర్వదర్శనం కౌంటర్లకు సులువుగా వెళ్లేందుకు వీలుగా ఆయా కౌంటర్ల వద్ద క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశాం. భక్తులు సెల్ఫోన్ ద్వారా స్కాన్ చేసి గూగుల్ మ్యాప్స్ ద్వారా ఇతర ప్రాంతాల్లోని కౌంటర్లను గుర్తించవచ్చు. భక్తులకు సమాచారం ఇచ్చేందుకు గాను చెర్లోపల్లి జంక్షన్, తిరుచానూరు వద్ద పూడి రోడ్డు, నవజీవన్ ఆసుపత్రి వెనుక హైవే వద్ద తగినంత మంది సిబ్బందిని ఏర్పాటు చేస్తాం. ఈ ప్రాంతాల్లో కూడా సమీపంలోని సర్వదర్శనం కౌంటర్ల క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తామని అన్నారు.
ఇక జనవరి 1, 2 నుండి 11వ తేదీ వరకు కలిపి మొత్తం 2.05 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు (రూ.300) విడుదల చేశామన్నారు. అలాగే జనవరి 2 నుండి 11వ తేదీ వరకు రోజుకు 2 వేలు చొప్పున శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లు టికెట్లు ఆన్లైన్లో విడుదల చేశామని, వీరికి కూడా మహాలఘు దర్శనం ఉంటుందన్నారు. సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని జనవరి 1న, వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 2 నుండి 11వ తేదీ వరకు స్వయంగా వచ్చే రాజ్యాంగబద్దమైన పదవుల్లో ఉన్న ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించడం జరుగుతుందని, ఒక వీఐపీకి రెండు గదులు మాత్రమే కేటాయిస్తామన్నారు. జనవరి 2 మరియు 3 వ తేదీల్లో ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని, ఆ తరువాత రద్దీని బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోవైపు డిసెంబరు 31, జనవరి 1వ తేదీల్లో తిరుపతిలోని కౌంటర్లలో ఎస్ఎస్డి టోకెన్లు ఇవ్వబడవని, అదేవిధంగా ఈ రెండు తేదీల్లో ఆఫ్లైన్లో శ్రీవాణి టికెట్లు కూడా ఇవ్వబడవని పేర్కొన్నారు.
భక్తులు మాస్క్ ధరించి రావాలి:
కోవిడ్ మళ్ళీ వ్యాపిస్తున్న పరిస్థితులు నెలకొన్నందువల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ మార్గదర్శకాలు జారీ చేశాయని, భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉన్నందువల్ల అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించి రావాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE