తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ నియామకాల్లో భాగంగా ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రస్తుతం దేహదారుఢ్య పరీక్షలు/ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (పీఎంటీ)/ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ) నిర్వహిస్తున్న తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీస్ నియామకాల్లో గర్భిణీ అభ్యర్థులకు సంబంధించి పీఎంటీ/పీఈటీ ఈవెంట్స్ మినహాయింపుపై తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) తాజాగా ఒక ప్రకటన చేసింది.
కొంతమంది అర్హత కలిగిన గర్భిణీ అభ్యర్థులు ప్రస్తుతం జరుగుతున్న పీఎంటీ/పీఈటీ ఈవెంట్స్ లో పాల్గొనకుండానే ఫైనల్ రాత పరీక్షకు హాజరయ్యేందుకు కోర్టు అనుమతించిందని తెలిపారు. కాగా ఆ గర్భిణీ అభ్యర్థులు ఫైనల్ రాత పరీక్షలో అర్హత సాధిస్తే, ఫైనల్ రాత పరీక్ష ఫలితాలు ప్రకటించిన 1 నెలలోపులో పీఎంటీ/పీఈటీ ఈవెంట్స్ కు హాజరవుతామని బోర్డుకి వ్రాతపూర్వక హామీ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ వారు అలాంటి వ్రాతపూర్వక హామీని ఇవ్వకపోతే, ఫైనల్ రాత పరీక్షకు హాజరయ్యేందుకు వారికి ఆసక్తి లేదని భావించబడుతుందని మరియు బోర్డు వారిని ఫైనల్ రాత పరీక్షకు అనుమతించదని పేర్కొన్నారు.
ఇక ప్రస్తుతం జరుగుతున్న రిక్రూట్మెంట్లో, ఫిల్ట్రేషన్ ప్రక్రియ యొక్క 2వ దశ అయిన పీఎంటీ/పీఈటీ ఈవెంట్స్ 2022, డిసెంబర్ 8 నుండి సజావుగా సాగుతున్నాయని మరియు ప్రస్తుతం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, సిద్ధిపేట వంటి 9 వేదికల్లో ప్రక్రియ కొనసాగుతోందన్నారు. సంగారెడ్డిలో డిసెంబర్ 17న, ఆదిలాబాద్ లో డిసెంబర్ 19న, నిజామాబాద్ లో డిసెంబర్ 20న ఈవెంట్స్ విజయవంతంగా ముగిశాయని తెలిపారు. పీఎంటీ/పీఈటీ ప్రక్రియ ఇప్పటికే దాదాపు 70 శాతం మంది అర్హులైన అభ్యర్థులను కవర్ చేస్తూ నేటికీ 18 పనిదినాల్లో నిర్వహించబడిందని, ఈ ఈవెంట్స్ ప్రక్రియ మరో 8-9 రోజులలో ముగుస్తుందని టీఎస్ఎల్పీఆర్బీ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE