అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్తో పాటు బుచ్ విల్మోర్లను భూమి మీదకు తీసుకుని రావడానికి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది.
ఎలాన్ మస్క్ సంస్థ స్పేస్ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్.. ఫ్లోరిడాలోని కేప్ కెనవరాల్ నుంచి.. సెప్టెంబర్ 29న నింగిలోకి దూసుకెళ్లింది. ఐఎస్ఎస్లో కొద్ది నెలలుగా చిక్కుకున్న వ్యోమగాములు సునీత్ విలియమ్స్, బుచ్ విల్మోర్ను తీసుకుని రావడానికి స్పేస్ఎక్స్ రాకెట్ బయలుదేరిందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన నాసా వెల్లడించింది.
వ్యోమనౌకలో ఇప్పుడు ఇద్దరు వ్యోమగాములు వెళ్లారని, దానిలో మరో రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. వారి తిరుగు ప్రయాణంలో ఐఎస్ఎస్ నుంచి విలియమ్స్, విల్మోర్ను తీసుకురానున్నట్లు నాసా తెలిపింది. నాసా వ్యోమగామి నిక్ హేగ్, రష్యాకు చెందిన కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్.. సునీత విలియమ్స్, బారీ బుచ్ విల్మోర్లకు అవసరమైన సరుకులతో ఆదివారం ఆకాశంలోకి బయలుదేరి వెళ్లారు.
బోయింగ్ కంపెనీ రూపొందించిన స్టార్లైనర్ అనే వ్యోమనౌకలో సునీతా విలియమ్స్, విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. నిజానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో సునీతా, విల్మోర్ను తిరిగి భూమి మీదకు తీసుకురావడానికి ముందుగా నాసా భావించింది. అయితే ఈ వ్యౌమనౌక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు చేరుకోవడానికి ముందే దానిలోని ప్రొపల్షన్ సిస్టమ్లో లీకులు ఏర్పడటంతో పాటు, థ్రస్టర్స్ మూసుకుపోవడం వంటి సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో 8 రోజుల్లో వెనక్కి రావాల్సిన ఈ వ్యోమగాములిద్దరూ నెలల తరబడి ఐఎస్ఎస్లో చిక్కుకుపోయారు.
ప్రొపల్షన్ వ్యవస్థలో లోపాన్ని సవరించి..వెంటనే వారిని భూమిపైకి తీసుకు రావడానికి నాసా అనేక ప్రయత్నాలు చేసింది. స్టార్లైనర్ ద్వారా 2, 3 సార్లు చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలం అయ్యాయి. దీంతో ఫలితంగా నాసా ఇప్పుడు ఎలాన్ మస్క్ స్పేస్ఎక్స్ సాయం తీసుకోవాల్సి వచ్చింది. ఏది ఏమైనా ఇప్పుడు ఈ నలుగురు వ్యోమగాములు క్షేమంగా తిరిగిరావాలని అంతా కోరుకుంటోంది.