త్రిపుర రాష్ట్రంలో అక్కడక్కడా చెదురుముదురు సంఘటనల మినహా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నేడు ఒకే విడతలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. గురువారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 4 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి సమయం దాటినా కూడా ఓటు వేసే అవకాశం కల్పించారు. ఇక ఈ ఎన్నికల్లో సాయంత్రం 3 గంటల వరకు 69.96 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఉదయం నుంచే క్రమంగా వేగం పుంజుకుని మధ్యాహ్నం 1 గంట వరకు 51.42 శాతం పోలింగ్ నమోదైంది.
కొన్ని కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతుండడంతో పూర్తి ఓటింగ్ శాతం ఇంకా ప్రకటించాల్సి ఉంది. అయితే 80 శాతంకుపైగా పోలింగ్ నమోదు కానున్నట్టు తెలుస్తుంది. త్రిపురలో సెపాహిజాలా జిల్లాలోని బోక్సానగర్ ప్రాంతంలో, అలాగే గోమతి జిల్లాలోని కక్రాబన్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా హింస చోటు చేసుకుంది. వేర్వేరు హింసాత్మక ఘటనల్లో సీపీఐ నాయకుడు, సీపీఎంకు చెందిన ఇద్దరు పోలింగ్ ఏజెంట్లు సహా పలువురు కార్యకర్తలు గాయపడినట్టు తెలుస్తుంది. మరోవైపు 40-45 చోట్ల ఈవీఎంలు స్తంభించడంతో అన్ని ఈవీఎం మెషీన్లను మార్చి ఓటింగ్ పునఃప్రారంభించినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు.
త్రిపురలో ముఖ్యంగా అధికార బీజేపీ-ఐపీఎఫ్టీ కూటమి, సీపీఎం-కాంగ్రెస్ కూటమి మరియు టిప్రా మోతా పార్టీల మధ్యనే కీలక త్రిముఖ పోటీ నెలకుంది. రాష్ట్రంలో మళ్లీ అధికారం దక్కించుకోవడంపై బీజేపీ, ఈసారి అధికారం తమదే అంటూ లెఫ్ట్-కాంగ్రెస్ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 60 స్థానాలకు గానూ అన్ని పార్టీల నుంచి 20 మంది మహిళలు సహా మొత్తం 259 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే బరిలో నిలిచిన వారి భవితవ్యం తేలాలంటే మరో 14 రోజులు ఆగాల్సి ఉంది. ఇక త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియను మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలతో పాటు మార్చి 2న నిర్వహించి, ఫలితాలు వెల్లడించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE