తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్ తగలనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా మద్యం ధరలను భారీగా పెంచడానికి రేవంత్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ పెంపు ధరలను వచ్చే నెల ఫిబ్రవరి నుంచి అమల్లోకి తీసుకురాబోతున్నట్లు ఎక్సైజ్ శాఖ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఎక్సైజ్ శాఖ అధికారులు ఇప్పటికే ధరల పెంపుపై కసరత్తు పూర్తి చేయడంతో.. మద్యం ధరలు పెంచాలంటూ త్రిసభ్య కమిటీ కాంగ్రెస్ ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించింది. బ్రాండెడ్ ఆల్కహాల్, బ్రాండెడ్ బీర్లు, చీప్ లిక్కర్ ధరలను పెంచాలని ఈ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
మద్యం ధరల పెంపు అంశంపై ఇటీవల ఎక్సైజ్ అధికారులు సచివాలయంలో సమావేశమై సీఎంతో చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో ప్రీమియం బ్రాండ్లపై, బీర్లపై సుమారు 15 శాతం వరకు ధరలు పెంచాలని..చీప్ లిక్కర్ రేట్లను తక్కువ శాతం పెంచాలని రేవంత్ సర్కార్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం మరికొద్ది రోజుల్లోనే తుది నిర్ణయం తీసుకోనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా బీర్ల ధరలను గట్టిగా పెంచే ఆలోచనలోనే సర్కార్ ఉంది. తెలంగాణకు బీర్లు సరఫరా చేసే బ్రూవరీలు, ఉత్పత్తి కేంద్రాలకు చెల్లించే ధరలను ప్రభుత్వమే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పెంచుతోంది. ఈ సారి వివిధ రకాల బ్రాండ్లపై రూ. 20 రూపాయల నుంచి రూ. 150 వరకు ధరలను పెంచాలని బ్రూవరీలు కోరారు. ఈ పెంపుదలలో భాగంగానే..తెలంగాణలో మద్యం ధరలు దాదాపు 15 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ మద్యం ధరలను 15 శాతానికి పెంచితే, ఎక్సైజ్ శాఖకు ఇప్పుడు వచ్చే ఆదాయానికి అదనంగా మరో 5 వేల కోట్ల రూపాయలు వచ్చే అవకాశముంది. ప్రస్తుతం ప్రభుత్వానికి మద్యం నుంచి వస్తున్న ఆదాయాన్ని 5వేల318 కోట్ల రూపాయలు పెంచాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా 2వేల260 మద్యం దుకాణాలు, 11వందల71 బార్లు ఉన్నాయి. వీటికి 6 బ్రూవరీల నుంచి ప్రతి సంవత్సరం 88 కోట్ల లీటర్ల బీరు ఉత్పత్తి అవుతుంది. మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం పెరుగుతోంది.