తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఏడవ విడత హరితహారం కార్యక్రమం జూలై 1, గురువారం నాడు ప్రారంభమైంది. అంబర్ పేట్ కలాన్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఏడవ విడత హరితహారం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం అంబర్ పేట్ కలాన్ అర్బన్ ఫారెస్ట్ పార్కును కూడా మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్క్లో మొక్కలు నాటి ఏడో విడత హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఎమ్మెల్సీలు మహేందర్రెడ్డి, సురభి వాణీదేవి, శంబిపూర్ రాజు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఏడవ విడత హరితహార కార్యక్రమం జూలై 1 నుంచి జూలై 10 వరకు కొనసాగనుంది. ఇప్పటికే ఆరు విడతల్లో 220.70 కోట్ల మొక్కలను నాటగా, ఏడవ విడత హరితహారం కింద 2021-22 సంవత్సరంలో 19.91 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. హరితహార కార్యక్రమంలో 230 కోట్ల మొక్కలు నాటాలన్న లక్ష్యానికి చేరువలో ఉన్నామని, ఈ ఏడాది ఆ లక్ష్యాన్ని అధిగమించనున్నట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. ఏడో విడత హరితహారంలో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గ్రామాల్లో ప్రతీ ఇంటికి ఆరు మొక్కలు ఇచ్చి నాటేందుకు ప్రోత్సహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలందరూ భాగస్వాములై మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ