రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రెండు రోజుల పాటు హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 1, శనివారం మధ్యాహ్నం 3.20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం రాష్ట్రపతి నిలయానికి చేరుకొని ఈ రోజు అక్కడ బస చేయనున్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హా గ్రామంలో 30 ఎకరాల్లో రూపుదిద్దుకున్న కన్హా శాంతివనం జనవరి 29వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ ధ్యాన కేంద్రంలో ఒకేసారి 1,00,000 మంది ధ్యానం చేసుకునే విధంగా సెంట్రల్ హాల్ మరియు ఎనిమిది ఇతర మందిరాలు ఉన్నాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా కన్హా గ్రామంలోని హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ను రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. శ్రీ రామచంద్ర మిషన్ 75 వార్షికోత్సవం సందర్భంగా అభ్యాసకులను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనదారులు ట్రాఫిక్ పోలీసులు సూచించిన ఇతర ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు కోరారు.
[subscribe]