జపాన్‌ గడ్డపై సీఎం రేవంత్‌రెడ్డి సత్తా

అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ మరోసారి సత్తా చాటుకుంది. హైదరాబాద్‌కు విశ్వ నగరంగా ఎప్పుడో గుర్తింపు తెచ్చకోవడంతో..అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్‌కు క్యూకడుతున్నాయి. ఇలాంటి సమయంలో తెలంగాణకు పెట్టుబడులు తెచ్చేందుకు జపాన్‌లో పర్యటిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి అక్కడ ఎక్స్‌పోకు తెలంగాణ ఎంపికయ్యేలా చేశారు.

అంతర్జాతీయ వేదికపై తెలంగాణ తన గొప్పతనాన్ని చాటింది. జపాన్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక ఒసాకా ఎక్స్‌పో 2025లో మొదటి భారతీయ రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సష్టించింది. సీఎం రేవంత్‌ రెడ్డి నేతత్వంలోని ‘తెలంగాణ రైజింగ్‌’ బృందం.. తెలంగాణ సంస్కృతి, పరిశ్రమలు, పెట్టుబడి అవకాశాలను విశ్వవేదికపై విజయవంతంగా ప్రదర్శించింది.

ఒసాకా ఎక్స్‌పో అనేది ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరిగే ప్రపంచస్థాయి వేడుక. దేశాలు, పరిశ్రమలు తమ నవీన ఆలోచనలను, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శించే వేదికగా దీనిని చెబుతారు. 2025 ఎడిషన్‌లో ‘మన జీవనానికి భవిష్య సమాజ రూపకల్పన’ అనే థీమ్‌తో ఏప్రిల్‌ 13 నుంచి ఆరు నెలల పాటు జపాన్‌లోని యుమేషిమాలో ఈ ఎక్స్‌పో జరుగుతుండటంతో.. ఈ ఏడాది తెలంగాణ భారత పెవిలియన్‌లో ప్రత్యేక ‘తెలంగాణ జోన్‌’ ఏర్పాటు చేసి, రేవంత్‌ రెడ్డి ఏప్రిల్‌ 21న దీనిని ఘనంగా ప్రారంభించారు.

ఈ పెవిలియన్‌లో తెలంగాణ సాంస్కృతిక వారసత్వం, పర్యాటక ఆకర్షణలు, సాంకేతిక పురోగతి అద్భుతంగా ప్రదర్శించబడ్డాయి. చార్మినార్, గోల్కొండ కోట వంటి సాంస్కృతిక చిహ్నాలతోపాటు, ఐటీ హబ్, ఫార్మా, ఎలక్ట్రానిక్స్, గ్రీన్‌ ఎనర్జీ వంటి పరిశ్రమల అభివృద్ధి వివరాలు అక్కడివారిని ఆకట్టుకున్నాయి. దీంతో అంతర్జాతీయ ఎక్స్‌పో మ్యాగజైన్‌లలో ప్రచురితమయ్యే ఈ పెవిలియన్‌ తెలంగాణకు శాశ్వత గుర్తింపును తెచ్చిపెట్టనుంది.

మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి జపాన్‌ పర్యటనలో భాగంగా మొత్తం 12 వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి ఒప్పందాలు కుదిరాయి. ఎన్‌టీటీ డేటా, నెసా కంపెనీలు హైదరాబాద్‌లో 10,500 కోట్ల రూపాయలతో ఏఐ డేటా సెంటర్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేయనున్నాయి. టోషిబా కార్పొరేషన్‌ 562 కోట్ల రూపాయలతో రుద్రారం వద్ద కొత్త ఫ్యాక్టరీ నిర్మాణానికి ఒప్పందం చేసింది. అంతేకాకుండా ఎకో టౌన్‌ ప్రాజెక్టు కోసం జపాన్‌కు చెందిన ఎక్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, నిప్పాన్‌ స్టీల్‌ ఇంజనీరింగ్‌ వంటి కంపెనీలతో లెటర్స్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ లు కుదిరాయి.

రేవంత్‌ జపాన్‌ టూర్లో భాగంగా.. కిటాక్యూషు గ్రీన్‌ సిటీని సందర్శించి, సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ మోడల్‌ను అధ్యయనం చేశారు. హైదరాబాద్‌ సమీపంలో 30,000 ఎకరాల్లో నిర్మితమవుతున్న ‘ఫ్యూచర్‌ సిటీలో ఈ నమూనాను అమలు చేయాలనే ఒప్పందం జిరగింది. ఈ ప్రాజెక్టులో జపాన్‌కు చెందిన మారుబెని కార్పొరేషన్‌తో కలిసి హైదరాబాద్ లో ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటు చేయనున్నారు. ఈ సిటీలో ఈ–మొబిలిటీ, సర్కులర్‌ ఎకానమీ, గ్రీన్‌ ఎనర్జీ వంటి ఆధునిక టెక్నాలజీలకు ముఖ్య ప్రాధాన్యత ఇవ్వనున్నారు.