నాగ్పూర్లో అమలవుతున్న వినూత్న ప్రాజెక్ట్లైన సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్వహణ, మెట్రోరైలు ప్రాజెక్ట్లో చేపట్టిన రెండు అంతస్తుల ఫ్లైఓవర్లు, అండర్పాస్ల నిర్మాణం, పార్కుల నిర్వహణ తదితర కార్యక్రమాలను నగర మేయర్ బొంతు రామ్మోహన్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ నేతృత్వంలోని జీహెచ్ఎంసీ అధికారుల బృందం నవంబర్ 19, మంగళవారం నాడు పరిశీలించింది. జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్లు శ్రీధర్, జియాఉద్దీన్, మున్సిపల్ శాఖ మంత్రి ఓ.ఎస్.డి మహేందర్లతో పాటు సూపరింటెండెంట్ ఇంజనీర్లు కూడా నాగ్పూర్ లో జరుగుతున్న ఈ కార్యక్రమాలను పరిశీలించారు. నాగ్పూర్లో రూ. 8,680 కోట్ల వ్యయంతో చేపట్టిన నాగ్పూర్ మెట్రో రైలు ప్రాజెక్ట్ను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ ప్రాజెక్ట్ అమలుపై నాగ్పూర్ మెట్రో రైలు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
ముఖ్యంగా 38.215 కిలోమీటర్ల విస్తీర్ణంలో చేపట్టిన మెట్రోరైల్కు డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లను వినూత్నంగా నిర్మించారు. రెండు ఫ్లైఓవర్లను ఒకదానిపై ఒకటి నిర్మించిన వీటిలో ఒక ఫ్లైఓవర్లో వాహనాల రవాణా, పై ఫ్లైఓవర్లో మెట్రో రైలు ప్రయాణించేవిధంగా నిర్మించారు. ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లకు భూ సేకరణ, ఆస్తుల సేకరణ తక్కువగా ఉండడం, ప్రాజెక్ట్ వ్యయంలో దాదాపు 40శాతం తగ్గడంతో పాటు మెట్రో రైలు ప్రాజెక్ట్ నిర్మాణం అత్యంత వేగంగా చేపట్టడానికి అవకాశం కలిగిందని నాగ్పూర్ మెట్రో అధికారులు వివరించారు. మెట్రో ప్రాజెక్ట్ అమలు, నిర్మాణం, నిర్వహణ, ప్రత్యేకతలపై జిహెచ్ఎంసి అధికారులకు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మెట్రోరైలు ప్రాజెక్ట్లో భాగంగా షటిల్ బస్ సర్వీసులు, బ్యాటరీ ద్వారా నడిచే వాహనాలు, ఫుట్పాత్ల ఏర్పాటు, సైకిళ్ల ఏర్పాటు తదితర సౌకర్యాలను కూడా ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఏర్పాటు చేసినట్టు వివరించారు.
నాగ్పూర్ నగరంలో పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్ షిప్ పద్దతిలో నిర్మించిన సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను మేయర్ రామ్మోహన్, ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్లతో కూడిన అధికారుల బృందం పరిశీలించింది. హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తున్న సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా వచ్చే నీటిని పార్కులకు, భవన నిర్మాణాలకు ఉపయోగించే విధంగా త్వరలోనే ఉత్తర్వులు జారీచేసే నేపథ్యంలో పిపిపి రంగంలో హైదరాబాద్ నగరంలోనూ ఎస్.టి.పిలను ఏర్పాటుచేసే అంశాలను పరిశీలిస్తున్నట్టు మేయర్ తెలిపారు. నాగ్పూర్లో నిర్మించిన అండర్పాస్లు, వీటిలో వర్షపునీరు చేరకుండా చేపట్టిన ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించారు. అదేవిధంగా నగరంలోని పలు ప్రధాన ప్రాంతాల్లో చేపట్టిన వర్టికల్ గార్డెన్లను కూడా ఈ బృందం పరిశీలించింది. హైదరాబాద్ నగరాన్ని కూడా పర్యటించాలని నాగ్పూర్ మెట్రో అధికారులను మేయర్ రామ్మోహన్ ఆహ్వానించారు. మేయర్ రామ్మోహన్ నేతృత్వంలో ఈ బృందం బుధవారం నాడు పూణె నగరాన్ని సందర్శించనుంది.
[subscribe]