తెలంగాణలో రేపు అంటే ఫిబ్రవరి 27న..మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.ఇప్పటికే 25వ తేదీ సాయంత్రం నుంచి వీరి ప్రచారం ముగిసింది. దీంతో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు తుది దశకు చేరుకున్నట్లు అయింది.
ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగనుండగా.. మార్చి3న ఫలితాలు ప్రకటిస్తారు. ఇదిలా ఉంటే..పోలింగ్ నేపథ్యంలో తెలంగాణ ఎక్సైజ్ శాఖ మందుబాబులకు చేదు వార్త చెప్పింది. ఫిబ్రవరి 25న సాయంత్రం 4 గంటల నుంచి ఫిబ్రవరి 27 సాయంత్రం 4 గంటల వరకు తెలంగాణలోని ఏడు జిల్లాల్లో మద్యం షాపులు మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
27వ తేదీన ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి, రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ రోజు ఎలాంటి అల్లర్లు జరగకుండా ఉండటానికి ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వైన్స్తోపాటు బార్లు, రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లు, కల్లు దుకాణాలు కూడా మూసి వేసినట్లు ఎక్సైజ్ శాఖ పేర్కొంది.
వరంగల్, ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఈ ఏడు ఉమ్మడి జిల్లాల్లో మద్యం షాపులను 48 గంటలు నిలిపివేసినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఎన్నికల నియమావళి ప్రకారం.. అధికారులు జారీ చేసిన జిల్లాల్లో ఎలాంటి మద్యం అమ్మకాలను జరుపకూడదు. కోడ్ ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖహెచ్చరించింది.
ఫిబ్రవరి 27న ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ నిర్వహిస్తారు.