తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఎనిమిదవ రోజు కూడ కొనసాగుతుంది. ఆర్టీసీ జేఏసీ నాయకులు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి సమ్మెకు మద్దతు ఇవ్వమని అక్టోబర్ 11, శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు బస్ భవన్ ఎదుట ధర్నా చేపట్టారు. భారీ ఎత్తున బీజేపీ కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికులు బస్ భవన్ వద్దకు చేరుకోవడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం బస్ భవన్ ముట్టడికి యత్నించడంతో అక్కడికి భారీగా చేరుకున్న పోలీసులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ని, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డిని అరెస్ట్ చేశారు. బస్ భవన్ వద్ద ధర్నా నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ స్తంభించి, ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.
బీజేపీ నాయకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ, ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే, త్వరలో ప్రగతి భవన్ను సైతం ముట్టడిస్తామని హెచ్చరించారు. వారంరోజులుగా సాగుతున్న సమ్మెను చర్చించి పరిష్కరించలేని ప్రభుత్వానికి, అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని విమర్శించారు. బీజేపీ పార్టీ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు నెరవేరేంత వరకు వారికీ అండగా ఉంటుందని స్పష్టం చేసారు. మరో వైపు శనివారం నాడు రాష్ట్రవ్యాప్తంగా పలు డిపోల ముందు మౌన దీక్ష చేస్తూ ఆర్టీసీ కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
[subscribe]