తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో కీలక నిర్ణయం తీసుకుంది. GHMC పరిధిలోని వార్డుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 150 నుంచి 300కు పెంచుతూ మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
రాష్ట్రంలో నగర పాలక సంస్థల పరిధిని పెంచే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల నగర పరిధిలోని 27 మున్సిపాలిటీలను GHMCలో విలీనం చేసిన నేపథ్యంలో, పెరిగిన విస్తీర్ణం, జనాభాకు అనుగుణంగా వార్డుల సంఖ్యను పెంచారు.
నిర్ణయం వెనుక కారణాలు
-
నివేదిక ఆధారం: GHMC కమిషనర్ సమర్పించిన వార్డు రీఆర్గనైజేషన్ స్టడీ రిపోర్డు ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
-
అధ్యయనం: ఈ అధ్యయనాన్ని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో చేపట్టారు.
-
ప్రాతిపదిక: GHMC పరిధిలో పెరిగిన జనాభా, పట్టణ విస్తరణను పరిగణనలోకి తీసుకుని, GHMC చట్టం 1955 (సెక్షన్ 8, సెక్షన్ 5) నిబంధనల ప్రకారం కొత్త వార్డుల సంఖ్యను 300కు ఖరారు చేశారు.
-
ఉపయోగం: వార్డుల సంఖ్య పునర్విభజన భవిష్యత్తులో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికలకు కీలకంగా మారనుంది.
అభ్యంతరాలకు అవకాశం
వార్డుల సంఖ్య పెంపు, పునర్విభజనపై ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత, ప్రజల నుంచి వారం రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించేందుకు అవకాశం ఇవ్వనుంది. అభ్యంతరాలు, సూచనలు పరిశీలించిన తర్వాత మార్పులు, చేర్పులు చేసి తుది నోటిఫికేషన్ను (Final Notification) ప్రభుత్వం విడుదల చేయనుంది.







































