గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన రాజకీయపార్టీలైన టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల కీలక నేతలు ప్రచారబరిలోకి దిగడంతో విమర్శలు, ప్రతి విమర్శలతో నగరంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా బీజేపీ పార్టీనుంచి కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ స్టార్ క్యాంపెయినర్ల సహా పలువురు నాయకులు బల్దియా పీఠమే లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
కాగా జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ పార్టీ జాతీయస్థాయి నేతలను కూడా రంగంలోకి దించుతుంది. ఇప్పటికే బీజేపీ యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం బుధవారం కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నగరానికి వచ్చారు. నగరంలో బీజేపీ అభ్యర్థుల తరపున ఆమె ప్రచారం నిర్వహిస్తారు. ముందుగా బీజేపీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్మృతి ఇరానీ మాట్లాడారు. నగరంలో వేల కోట్లు ఖర్చు చేసినట్లు టిఆర్ఎస్ అబద్దం చెబుతుందని విమర్శించారు. పాతబస్తీలో రోహింగ్యాలకు, బంగ్లాదేశీయులకు ఎందుకు ఓటు హక్కు కల్పిస్తున్నారని ప్రశ్నించారు. దేశంలోకి, నగరంలోకి అక్రమ చొరబాటుదారులు రాకుండా బీజేపీ కాపాడుతుందని ఆమె స్పష్టం చేశారు. ఆమెతో పాటుగా బీజేపీ మహిళ మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ నగరానికి వచ్చారు. మరోవైపు కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు జాతీయ నాయకులు కూడా ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉన్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ