నివర్ తుఫాన్ తీవ్రంగా దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో తుఫాన్ ప్రభావం అత్యధికంగా ఉండే తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీ ప్రభుత్వాల యంత్రాంగాలు అప్రమత్తమై చర్యలు తీసుకుంటున్నాయి. మరికొద్ది గంటల్లో నివర్ అతి తీవ్ర తుపాన్గా మారే అవకాశముంది. ప్రస్తుతం పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయ దిశలో 300 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి ఆగ్నేయంగా 350 కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. బుధవారం రాత్రికి మమాళ్ల పురం-కరైకల్ మధ్య పుదుచ్చేరి సమీపంలో తుపాన్ తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్టు ఐఎండీ వెల్లడించింది. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ నివర్ తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. నివర్ తుపాను నేపథ్యంలో రాష్ట్రంలో అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లాల అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. తుఫాన్ వల్ల ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా చర్యలు తీసుకుని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిత్తూరులో ఈ రోజు, రేపు విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇక తమిళనాడులో బుధవారం నాడు పబ్లిక్ హాలిడే ప్రకటించారు. ఏడు జిల్లాల్లో బస్సు సర్వీసులు నిలిపివేశారు. ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని ముఖ్యమంత్రి పళనిస్వామి విజ్ఞప్తి చేశారు. అలాగే తుఫాన్ ప్రభావం ఎక్కువుగా ఉండే 4,000 ప్రాంతాలను గుర్తించామని, ప్రజల భద్రత విషయంలో స్థానిక అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు. నివర్ తుఫాన్ నేపథ్యంలో సహాయక చర్యల నిమిత్తం ఇప్పటికే తమిళనాడు, పుదుచ్చేరి మరియు ఆంధ్రప్రదేశ్ లలో 1,200 మందికి పైగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని నియమించారు. తమిళనాడులో కడలూరు జిల్లాలో ఆరు, చెన్నైలో రెండు టీమ్స్, ఆంధ్రప్రదేశ్లో ఏడు టీమ్స్, పుదుచ్చేరిలో మూడు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ను మోహరించారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కేరళలలో అదనంగా మరో 20 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ స్టాండ్బైలో ఉన్నట్టు ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ సత్య నారాయణ్ ప్రధాన్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ