కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో వాయిదా పడిన పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ వీడింది. జీహెచ్ఎంసీ పరిధిలో మినహా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పరీక్షలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ముందుగా పదో తరగతి పరీక్షల నిర్వహణపై దాఖలైన పిటిషన్పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పరీక్షలు నిర్వహంచడం సాధ్యమవుతుందా అనే అంశంపై కీలకంగా విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదనల అనంతరం పదో తరగతి పరీక్షల నిర్వహణపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
జీహెచ్ఎంసీ పరిధిలో పరీక్షలను వాయిదా వేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని విద్యార్థులను సప్లిమెంటరీ పరీక్షలకు అనుమతించాలని, అలాగే సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన వారినికూడా రెగ్యులర్గానే పరిగణించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో పదో తరగతి పరీక్షలను నిర్వహించుకోవచ్చని హైకోర్టు ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. మరోవైపు పరీక్షల నిర్వహణకు రాష్ట్ర విద్యాశాఖ ఇటీవలే షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జూన్ 8 వ తేదీ నుంచి జూలై 5 వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ విడుదల చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu