దేశంలోని పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వెలుగులోకి వచ్చింది. బర్డ్ ఫ్లూ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై అన్ని రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డెయిరింగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. బర్డ్ ఫ్లూ పరిస్థితిని పర్యవేక్షించడంతో పాటుగా రోజువారీగా రాష్ట్రాల అధికారులు చేపట్టిన నివారణ మరియు నియంత్రణ చర్యల ఆధారంగా కంట్రోల్ రూమ్ ద్వారా సూచనలు ఇవ్వనున్నారు. ఇప్పటివరకు రాజస్థాన్ రాష్ట్రంలో బారన్, కోటా, జలవార్ ప్రాంతాల్లో కాకుల్లో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మందసౌర్, ఇండోర్, మాల్వా ప్రాంతాల్లో కాకుల్లో, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కాంగ్రాలో వలస పక్షుల్లో, కేరళ రాష్ట్రంలోని కొట్టాయం, అల్లాపుజ ప్రాంతాల్లో పౌల్ట్రీలలోని బాతుల్లో కలిపి దేశంలో మొత్తం 12 సెంటర్లలో బర్డ్ ఫ్లూను నిర్ధారణ అయినట్టుగా కేంద్రం వెల్లడించింది.
ఈ వ్యాధి మరింతగా వ్యాప్తి చెందకుండా ఉండటానికి తీసుకోవాల్సిన నివారణ చర్యలపై ఆయా రాష్ట్రాలకు ఇప్పటికే ఏవియన్ ఇన్ఫ్లుఎంజా(బర్డ్ ఫ్లూ) జాతీయ కార్యాచరణ ప్రణాళిక ప్రకారం కీలక సూచనలు చేసినట్టు కేంద్రం తెలిపింది. పౌల్ట్రీలలో బయో సెక్యూరిటీని బలోపేతం చేయడం, బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాలో క్రిమిసంహారక మందులు చల్లడం, చనిపోయిన పక్షుల మృతదేహాలను పారవేయడం, సరైన సమయంలో నమూనాలను సేకరించి నిర్ధారణ కోసం సమర్పించడం, ప్రభావిత పక్షులు నుండి పౌల్ట్రీలకు మరియు మానవులకు బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన నివారణ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించినట్టు తెలిపారు. అలాగే పక్షుల అసాధారణంగా మరణిస్తే నివేదించడం కోసం రాష్ట్రాల అటవీ శాఖతో సమన్వయం చేసుకోవాలని ప్రభుత్వాలకు సూచించారు. ఇక ఇతర రాష్ట్రాల్లో కూడా పక్షులలో ఎక్కడైనా అసాధారణ మరణాలను గుర్తిస్తే వెంటనే అవసరమైన చర్యలు తీసుకుని కేంద్రానికి నివేదించాలని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ