గాజువాక నియోజకవర్గంలో జనసేన పార్టీకి మరొక షాక్ తగిలింది. గాజువాక సీనియర్ నాయకుడు కరణం కనకారావు జనసేన పార్టీకి రాజీనామా చేశారు. గాజువాక నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు. ఎమ్మెల్యే నాగిరెడ్డి ఈ సందర్భంగా కనకరావుకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కనకారావుతో పాటుగా మరో 200 మంది జనసైనికులు కూడా వైసీపీ పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019లో సార్వత్రిక ఎన్నికల జరిగిన సమయంలో గాజువాక నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఎన్నికల ప్రచారంలో కరణం కనకారావు కీలకంగా వ్యవహరించారు. కొన్ని నెలల క్రితమే గాజువాక మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు చింతలపూడి వెంకట్రామయ్య జనసేన పార్టీని వీడారు, ఇప్పుడు మరో సీనియర్ నాయకుడు కనకారావు కూడా పార్టీ వీడడంతో నియోజకవర్గ పార్టీ వ్యవహారాలపై పవన్ కళ్యాణ్ దృష్టిసారించాలని కార్యకర్తలు, అభిమానులు కోరుతున్నారు.
[subscribe]