తెలంగాణలో సినిమా పరిశ్రమతో పాటు బుల్లితెర (టెలివిజన్) రంగాన్ని కూడా మరింత ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సచివాలయంలో టెలివిజన్ అవార్డు కమిటీ ప్రతినిధులతో సమావేశమై, రాష్ట్ర స్థాయి టీవీ అవార్డుల ఏర్పాటు, ఎంపిక విధానం మరియు అవార్డుల రూపకల్పనపై విస్తృతంగా చర్చించారు. తెలంగాణకు చెందిన బుల్లితెర నటీనటులు, దర్శకులు, రచయితలు, సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తించి ప్రభుత్వం తరఫున ప్రత్యేక అవార్డులు అందించాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు.
పీవీ నరసింహారావు పేరుకు ప్రాధాన్యం
ఈ సమావేశంలో టీవీ అవార్డులకు ప్రత్యేక పేరు, లోగో రూపకల్పనతో పాటు వివిధ విభాగాలపై చర్చ జరిగింది. తెలంగాణ సంస్కృతి, ఆత్మను ప్రతిబింబించేలా అవార్డుల రూపకల్పన ఉండాలని మంత్రి సూచించారు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరును ఈ అవార్డులకు పెట్టే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
పారదర్శక ఎంపికకు మార్గదర్శకాలు
టీవీ అవార్డుల ఎంపిక ప్రక్రియ పూర్తిస్థాయి పారదర్శకతతో సాగాలని, ఎలాంటి వివాదాలకు అవకాశం లేకుండా స్పష్టమైన నిబంధనలు రూపొందించాలని మంత్రి కమిటీ సభ్యులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన సమగ్ర రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను త్వరలో సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించాలని సూచించారు. ప్రతిభ ఆధారంగానే అవార్డులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఎంపిక విధానాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు.
బుల్లితెర రంగంలో ఆనందం
తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా బుల్లితెర కళాకారులు, సాంకేతిక నిపుణుల కోసం ప్రత్యేక రాష్ట్ర అవార్డులను తీసుకురావడానికి సిద్ధమవుతుండటంతో టెలివిజన్ రంగంలో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయం చిన్నతెర కళాకారులకు మరింత గుర్తింపు తీసుకురావడంతో పాటు తెలంగాణ టెలివిజన్ పరిశ్రమ అభివృద్ధికి కూడా కొత్త ఊపు తీసుకువస్తుందని సినీ, టీవీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.








































