ఆంధ్రప్రదేశ్లో అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పీలేరు పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనపై చేసిన విమర్శలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటుగా స్పందించారు. సోమవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాకు వచ్చి తన గురించి పదేపదే మాట్లాడుతున్నారని, అయితే తాను ఆయనలాగా సొంతవాళ్ల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేస్తున్నానని అన్నారు. చంద్రబాబు పని అయిపోయిందని, ఈసారి కుప్పంలో టీడీపీ జెండా పీకేసి, వైయస్ఆర్సీపీ జెండా పాతుతామని ధీమా వ్యక్తం చేశారు. అక్కడ వైసీపీ అభ్యర్ధే గెలుస్తారని, ఒకవేళ తమ పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు నాయుడుపై పోటీకి సిద్ధమని స్పష్టం చేశారు.
తాను పుంగనూరు, కుప్పం రెండు చోట్లా పోటీకి సిద్ధమని, అయితే పుంగనూరులో తనపై పోటీ చేసేందుకు చంద్రబాబు సిద్ధమేనా అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ చేశారు. పుంగనూరు పక్కన పెడితే కుప్పంలో కూడా చంద్రబాబుకు డిపాజిట్ రావడం కూడా కష్టమేనని, తన జెండాను మోయలేక, పవన్ కళ్యాణ్ సాయం కోరుతున్న చంద్రబాబుకు కుప్పంలో తన ఓటమి అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మానసిక పరిస్థితి బాగోలేదని, అందుకే ఆయన సంయమనం కోల్పోయి మాట్లాడుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా చంద్రబాబుతో పోరాడుతున్నానని, చిత్తూరు జిల్లాలో మాపై పైచేయి సాధించడం ఆయన తరం కాదని వ్యాఖ్యానించారు. తాను మళ్ళీ గెలవలేనని అర్ధమైనందునే జిల్లాలో టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని, ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసిన సీఎం జగన్ గెలుపును అడ్డుకోలేరని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE