ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన డిసెంబర్ 11, బుధవారం నాడు సచివాలయంలో మంత్రివర్గం సమావేశం అయింది. ఈ మంత్రి వర్గ సమావేశంలో ముందుగా పొందుపరిచిన 22 అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి సంబంధిత అంశాలపై మంత్రులతో సీఎం వైఎస్ జగన్ చర్చిస్తున్నారు. మరో వైపు అసెంబ్లీలో శీతాకాల సమావేశాలు జరుగుతుండడంతో పలు బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకునే దిశగా చర్చలు జరుపుతున్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాల్లో మహిళల భద్రత అంశంపై చర్చించిన సమయంలో మహిళలపై అత్యాచారాలను అరికట్టేందుకు చట్టాన్ని తీసుకొస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ దిశగా రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే మరణశిక్ష విధించే విధంగా ఏపీ క్రిమినల్ లా చట్టం (సవరణ)-2019 కు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది. ఈ చట్టం ద్వారా మహిళలపై జరిగే ఘటనల్లో ఆధారాలు లభించినప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారించి కేవలం 21 రోజుల్లో తీర్పు వెలువరించే విధంగా రూపొందిస్తున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లు, ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్ల ఏర్పాటు బిల్లు, రైతు బీమా కార్పొరేషన్ తదితర అంశాలపై మంత్రివర్గంలో చర్చిస్తున్నారు.
[subscribe]