శ్రీకాకుళం జిల్లాలోని కీలక నియోజకవర్గమైన రాజాం.. 2009లో నియోజకవర్గాల పునర్విభజన తరువాత ఏర్పాటైంది. ఈ నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి కూడా రిజర్వుడు స్థానంగానే ఉంటూ వస్తోంది. ఇప్పటి వరకు జరిగిన మూడు ఎన్నికల్లో వైసీపీ రెండుసార్లు, కాంగ్రెస్ పార్టీ ఒకసారి విజయం సాధించింది. ఇప్పుడు రానున్న ఎన్నికలను కూడా టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇక్కడ పోరు ఎలా ఉంటుందనే చర్చలు జరుగుతున్నాయి.
నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత రాజాం నియోజకవర్గం ఏర్పాటయింది. మొదటి నుంచీ కూడా రాజాం ఎస్సీ రిజర్వుడ్ స్థానంగా ఉంటూ వస్తోంది. రాజాం నియోజకవర్గంలో 2,13,768 మంది ఓటర్లు ఉండగా..వారిలో 1,07,125 మంది పురుష ఓటర్లు, 1,06,630 మంది మహిళలు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో పురుష ఓటర్లు మహిళల కంటే ఎక్కువగా ఉండటం విశేషం.
2009లో తొలిసారి రాజాం నియోజకవర్గంలో ఎన్నికలు జరగగా..అప్పుడు కొండ్రు మురళీమోహన్ విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కొండ్రు మురళీమోహన్..టీడీపీ నుంచి పోటీ చేసిన ప్రతిభా భారతిపై విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కొండ్రు మురళి మోహన్ 27,133 ఓట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసుకున్నారు.
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014లో వైసీపీ విజయం సాధించింది. టీడీపీ నుంచి మరోసారి పోటీ చేసిన ప్రతిభా భారతిపై పోటీ చేసిన కంబాల జోగులు 512 స్వల్ప ఓట్ల తేడాతో గెలిచారు. అలాగే 2019లోనూ మరోసారి కంబాల జోగులు ఇక్కడి నుంచే విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ పై కంబాల జోగులు 16,848 ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే ఇప్పటి వరకు జరిగిన 3 ఎన్నికల్లో కూడా టీడీపీ ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయింది.
రాజాం నియోజకవర్గంలో రాజాం, రేగిడి ఆముదాలవలస, వంగర, సంతకవిటి అనే నాలుగు మండలాలున్నాయి. ఈ నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి విజయాన్ని దక్కించుకోలేకపోయిన టీడీపీ రానున్న ఎన్నికల్లో ఎలా అయినా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసిన కొండ్రు మురళీమోహన్ ను.. మరోసారి ఇక్కడ నుంచి బరిలోకి దింపడానికి టీడీపీ రెడీ అవుతోంది. కాకపోతే దీని కంటే ముందు ఇక్కడ ఉన్న అంతర్గత విబేధాలపై చంద్రబాబు దృష్టి పెట్టాల్సి ఉంది.
ఇటు ప్రతిభా భారతి తన కుమార్తెను బరిలోకి దింపడానికి సన్నాహాలు చేసుకుంటూ ఉండగా… మరోవైపు మురళి మోహన్ తన అభ్యర్థిత్వం ఖరారు అయినట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఈ ఇద్దరి మధ్య ఉన్న అంతర్గత విభేదాల వల్ల ..పార్టీ నష్టపోతున్నట్లు తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక రాజాంలో 2 సార్లు విజయం సాధించిన కంబాల జోగులను పాయకరావుపేటకు బదిలీ చేసిన వైసీపీ..డాక్టర్ గా సేవలందిస్తున్న మరో వ్యక్తిని కొత్త అభ్యర్ధిగా బరిలోకి దించనుంది.
వైసీపీ కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల వల్ల రాజాం నియోజకవర్గం విజయనగరం జిల్లాలో చేరిపోయింది. విజయనగరం జిల్లాపై మొదటినుంచీ ఆధిపత్యం చెలాయిస్తున్న బొత్స కుటుంబం.. ఇప్పుడు ఈ నియోజకవర్గంపై పట్టు నిరూపించుకోవాలని తహతహలాడుతోంది. ఇది కొంత వరకు వైసీపీ అభ్యర్థికి కలిసి వచ్చే అవకాశం అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE