మున్సిపల్‌ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల, గతంలో నిలిచిన ప్రక్రియ నుంచే కొనసాగింపు

AP Municipal Elections Schedule Released

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎన్నికల సందడి కొనసాగనుంది. ఓవైపు పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా, సోమవారం నాడు రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. 12 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ విడుదల చేసింది. కాగా గత సంవత్సరంలో నిలిచిన ఈ ఎన్నికల ప్రక్రియను మళ్ళీ అక్కడినుంచే కొనసాగించే విధంగా ఎస్ఈసీ ఉత్తర్వులు వెలువరించింది. ముందుగా మార్చి 7, 2020 న మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవగా, ఎన్నికల ప్రక్రియ నామినేషన్ల పరిశీలన దశ(మార్చి 14,2020) వరకు పూర్తయింది. మార్చి 23, 2020న పోలింగ్ జరగాల్సి ఉండగా, రాష్ట్రంలో కరోనా పరిస్థితుల వలన మార్చి 15, 2020 న ఎన్నికలు వాయిదా వేస్తున్నట్టు ఎస్ఈసీ ప్రకటించింది.

ఈ నేపథ్యంలో మున్సిపల్‌ ఎన్నికల పక్రియ ఏదశలో ఆగిపోయిందో మళ్ళీ అక్కడినుంచే ప్రారంభించే ఎస్ఈసీ తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో మార్చి 3, 2021 న నామినేషన్ల ఉపసంహరణ దశ నుంచి ఎన్నికల పక్రియ ప్రారంభం కానుంది. మార్చి 10 న విజయనగరం, ఏలూరు, మచిలిపట్నం, గుంటూరు, ఒంగోల్, తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్ మున్సిపల్ కార్పొరేషన్స్ తో పాటుగా గ్రేటర్ విశాఖపట్నం, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లలో మరియు 13 జిల్లాలోని 75 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల ఎన్నికలకు పోలింగ్ నిర్వహించనున్నారు.

ఏపీలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్:

  • నామినేషన్ల ఉపసంహరణ ప్రారంభం : మార్చి 2 (ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు)
  • నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ : మార్చి 3 (మధ్యాహ్నం 3 గంటల వరకు)
  • పోటీలో నిలిచిన అభ్యర్థులు తుది జాబితా ప్రచురణ : మార్చి 3 (మధ్యాహ్నం 3 గంటల తర్వాత)
  • పోలింగ్ తేదీ: మార్చి 10 (ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు)
  • రీపోలింగ్ (అవసరమైతే) : మార్చి 13 (ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు)
  • ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటన: మార్చి 14 (ఉదయం 8 గంటల నుంచి)
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ