
కొన్ని నెలలుగా వైసీపీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు, వ్యవహారశైలి పార్టీ వర్గాలకే కాదు చివరకు అధిష్టానానికి కూడా అంతుచిక్కడం లేదు. మంత్రివర్గం నుంచి ఆయనను తప్పించాక.. రీజినల్ కోఆర్డినేటర్ పదవిని ఆయన వద్దనుకున్నారు. అయినా పార్టీనుంచి బయటకు వెళ్లకుండా అక్కడే ఉంటూ సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేయడం వైసీసీ వర్గాలకు మింగుడు పడటం లేదు. పోనీ పార్టీ మారుతానని చెబుతున్నారా అంటే అదీ లేదు.
పార్టీ మారడానికే ఇలాంటి వ్యాఖ్యలా అని వస్తున్న ప్రశ్నలను ఆయన ఖండిస్తూ పార్టీని వీడేదే లేదంటూ ఖరాఖండిగా చెబుతున్నారు. చివరకు సీఎం జగన్ ఎప్పటికపుడు తాడేపల్లికి పిలిపించి మాట్లాడినా.. సర్ది చెప్పి పంపిస్తున్నా ఆయన వైఖరి మాత్రం మారడం లేదు. దీంతో బాలినేని అంతరంగం ఏంటో తెలియక నేతలు తలలు పట్టుకుంటే. ప్రకాశం జిల్లా ప్రజలలో ఇదే చర్చనీయాంశంగా మారింది.
సీఎం జగన్ ముందు అన్నిటికీ తలాడిస్తున్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి..బయటకు వచ్చిన తర్వాత తన పాత వైఖరినే అవలంబిస్తున్నారు. తాను చెప్పాలనుకున్న విషయాలన్నిటినీ బహిరంగ సమావేశాల్లోనే చెప్పి కుండబద్దలు కొట్టేస్తున్నారు. దీంతో ఆయన మాటలు ప్రతిపక్ష పార్టీలకు అస్త్రంగా మారుతున్నాయి. తాజాగా ఈ నెల 21న సీఎం జగన్ జన్మదిన వేడుకలు పార్టీ నేతలు, కేడర్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించినా బాలినేని మాత్రం ఎక్కడా కనిపించలేదు.
ఎప్పుడూ సీఎం జగన్ జన్మదిన వేడుకల్లో హడావుడి చేసే బాలినేని .. ఈసారి తాడేపల్లికి వెళ్లి ముఖ్యమంత్రికి పుష్పగుచ్చం కూడా అందించలేదు. ఫ్లెక్సీలు వేయలేదు సరికదా చివరకు సోషల్ మీడియాలో చిన్న విషెస్ కూడా లేదు. ఇలా పార్టీకి తలనొప్పిగా మారిన బాలినేనిని వదిలించుకోవడానికి వైసీపీ హైకమాండ్ కూడా డిసైడ్ అయిపోయిందట. ఇప్పటికే తాడేపల్లి డోర్స్ కూడా క్లోజ్ అయినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదే సమయంలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే అప్పుడు మన పరిస్థితి ఏంటని కార్యకర్తలను బాలినేని అడిగిన విషయం మరోసారి వార్తల్లోకి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే మన పరిస్థితి ఏంటని.. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఓసారి ఆలోచించుకోవాలని బాలినేని చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు తాము అధికారంలోకి వస్తే వైసీపీ నాయకుల తాట తీస్తామంటూ జనసేన, టీడీపీ నేతలు చేసిన హెచ్చరికలను కూడా బాలినేని గుర్తు చేశారట.
గత నెలలో ప్రకాశం జిల్లాలో జరిగిన వైసీపీ బస్సు యాత్రకు బాలినేని దూరంగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో మార్కాపురం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి పోటీ చేస్తారని, ఆయన్ను గెలిపించుకోవాలని పార్టీ నేతలకు జగన్ సూచించారు. అయితే ఇదే బాలినేని అలకకు కారణం అయింది. రోజంతా జగన్తో కలిసే ఉన్నా సరే తమకు చెప్పకుండా.. నాగార్జునరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఏకపక్షంగా ప్రకటించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మార్కాపురం టికెట్ ఆశిస్తున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి కూడా కనిగిరి పర్యటనకు దూరంగా ఉన్నారు. ఇటు తన నియోజయవర్గంలో 25వేల ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తేనే తాను పోటీ చేస్తానని బాలినేని ప్రకటించారు. దీన్ని ప్రభుత్వం పట్టించుకుకోపోగా.. మంత్రివర్గం నుంచి తప్పించారు. కానీ నియోజకవర్గ సమస్యలను పరిష్కరించ లేదు. దీంతో బాలినేని తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
ప్రకాశం జిల్లాలో నకిలీ భూ దస్తావేజుల కేసులో తీరుపై బాలినేని ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఆ సమయంలో పోలీసుల తీరుకు నిరసనగా తన గన్మెన్లను ప్రభుత్వానికి అప్పగించారు. కలెక్టర్ సమక్షంలో ఎంతటి వారినైనా వదిలిపెట్టవద్దని బాలినేని శ్రీనివాసరెడ్డి ఎస్పీని కోరారు. నాలుగేళ్ల నుంచే పార్టీలో ఇలాంటి పరిస్థితులు చూస్తున్న బాలినేని, ఇపుడు జగన్ జన్మదిన వేడులకు దూరమవడం హాట్ టాపిక్ అయింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE